ఆంధ్ర జ్యోతి వ్యాసం:
తొమ్మిదేళ్ల తెలంగాణా పాలనలో ప్రజాపక్షం ఎంత ?
కన్నెగంటి రవి,రైతు స్వరాజ్య వేదిక ,
ఫోన్: 9912928422
(జూన్ 2 - తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా)
----------------------------------------------------------------------------
2014 జూన్ 2 న తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని 10 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ రాష్ట్ర ఆవిర్భావం కోసం సుదీర్ఘ కాలం పోరాడిన సాధారణ ప్రజలకు, ఉద్యమ శక్తులకు శుభాకాంక్షలు. మనసు నిండా అనేక ఆకాంక్షలు నింపుకుని , ఉద్యమించిన ప్రజలు తమ జీవితాలు బాగు పడతాయని అనేక కలలు కన్నారు.
ప్రజాస్వామ్యం, ప్రభుత్వ పాలనా తీరు, ఎన్నికల హామీల అమలు, చట్టాల అమలు, ఆర్ధిక వ్యవస్థ పని తీరు, సామాజిక న్యాయం, సహజ వనరుల వినియోగం, ఉపాధి అవకాశాలు , పర్యావరణం లాంటి కీలకమైన తొమ్మిది అంశాలను పరిశీలించడం ద్వారా, తొమ్మిదేళ్ల ప్రభుత్వ పాలనా స్వభావాన్ని అర్థం చేసుకోవాలి.
ప్రస్తుత అధికార పార్టీ గత తొమ్మిదేళ్లలో పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థను పూర్తిగా భ్రస్టు పట్టించింది.
ఇతర పార్టీల కార్యకర్తలను, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి , కొనుగోలు చేయడానికి వందల కోట్లను వెచ్చిస్తున్నది. స్థానికంగా గెలిచిన ఇతర పార్టీల అభ్యర్ధులను, ప్రలోభ పెట్టి తన పార్టీలో కలిపేసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన ఇతర పార్టీల శాసన సభ్యులను, తన పార్టీలో చేర్చుకుని, ప్రజల తీర్పుపై తనకేమీ గౌరవం లేదని చెప్పింది. తమది ఫక్తు రాజకీయ పార్టీ అని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నది.
ఆధిపత్యాన్ని , వివక్షను తెలంగాణా ప్రజలెప్పుడూ సహించరు. సమైక్యాంధ్ర పాలకుల వివక్షా పూరిత పాలనపై తెలంగాణా ప్రజలు తిరగబడింది కూడా అందుకే. కానీ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో కూడా ప్రజలకు స్వేచ్ఛగా గాలి పీల్చుకునే అవకాశం రాలేదు. దశాబ్ధాల పోరాటాలతో గ్రామీణ ప్రజలు తెలంగాణాలో కూల్చేసిన వందలాది దొరల గడీల సారం మళ్ళీ ప్రగతి భవన్ రూపంలో నగరం నడిబొడ్డున వెలిసింది. తాజాగా ఇప్పుడు నయా సెక్రటేరియట్ అదే స్వభావంతో నిర్మాణమైంది.
ప్రభుత్వ పెద్దలు స్వయంగా ప్రజల నుండీ దరఖాస్తులు తీసుకోరు. ప్రజల సమస్యలపై చర్చకు ప్రతిపక్ష పార్టీలకు, ప్రజా సంఘాలకు సమయం ఇవ్వరు. తమను ప్రశ్నించే మీడియా సంస్థలను కూడా సచివాలయంలోకి అడుగు పెట్టనివ్వరు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు జిల్లాల పర్యటనకు వెళితే, ప్రజా సంఘాల కార్యకర్తలు ముందస్తు అరెస్టులతో పోలీస్ స్టేషన్ల లో మగ్గాలి.
ఈ ప్రభుత్వ పాలనా కాలంలో 16 ప్రజా సంఘాలపై నిషేధం, ఇందిరా పార్క్ ధర్నాచౌక్ రద్ధు నిర్ణయాలపై కోర్టు తీర్పులతో కొంత ఊరట లభించినా, అవి ప్రభుత్వ స్వభావానికి అద్దం పట్టాయి. ప్రజా సంఘాల కదలికలపై, సమావేశాలపై ఆంక్షలు, విపరీతంగా పెరిగిన పోలీస్ నిఘా, సర్వైవలెన్స్ ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తున్న చర్యలే.
ఆర్టీసీ కార్మికుల, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల , రెవెన్యూ ఉద్యోగుల, తాజాగా గ్రామ పంచాయితీ జూనియర్ కార్యదర్శుల సమ్మె పోరాటాలపై బెదిరింపులు, వారితో చర్చలకు నిరాకరించడం, వారి యూనియన్ల ఉనికిని గుర్తించక పోవడం ఈ ప్రభుత్వం చట్ట బద్ధ పాలనకు కట్టుబడి లేదని చెప్పకనే చెబుతాయి.
2014, 2018 ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సీరియస్ గా పూనుకోలేదు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే ,సెటిల్ మెంట్ చేయక పోవడం, . ప్రభుత్వ రంగంలో నిజాం సుగర్స్ లిమిటెడ్ ను పునరుద్ధరించకపోవడం, ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించక పోవడం, 30 లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్న ప్రభుత్వ స్కూల్స్ లో, విద్యార్ధుల వసతి గృహాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయక పోవడం నిరుద్యోగులకు భృతి ఇవ్వక పోవడం అందులో కొన్ని మాత్రమే.
అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను, ప్రభుత్వం విడుదల చేసిన జీవో లను అమలు చేయడంలో ఈ ప్రభుత్వానికి రాజకీయ చిత్త శుద్ధి లోపించింది. దున్నేవారికి భూమి కావాలని పోరాడిన తెలంగాణాలో భూమి లేని పేదలకు భూమి అందించడాని కి 1973 భూ సంస్కరణల చట్టం వైపు అసలు దృష్టే సారించనే లేదు. రాష్ట్రంలో 2011 కౌలు రైతుల గుర్తింపు చట్టాన్ని అమలు చేయడం లేదు. 2016 లో ఆమోదించిన వ్యవసాయ కుటుంబాల ఋణ విముక్తి చట్టం క్రింద ఏర్పడిన కమిషన్ ఛైర్మన్ గా రిటైర్డ్ న్యాయమూర్తి స్థానంలో తమ పార్టీ నాయకులను నియమించి కమిషన్ ను పని చేయకుండా ఆపింది.
2013 భూ సేకరణ చట్టం స్పూర్తికి, ప్రజాభిప్రాయ సేకరణ పద్ధతికి తూట్లు పొడిచి, వివిధ జిల్లాలలో అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో, వేలాది ఎకరాలను ప్రభుత్వం బలవంతంగా రైతుల నుండీ గుంజుకుంటున్నది.
ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. నిజానికి ఉమ్మడి రాష్ట్రంతో పోల్చినప్పుడు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు పన్నుల రూపంలో అందుబాటులోకి వచ్చినప్పటికీ, సరైన అభివృద్ధి నమూనా లేకపోవడం వల్ల, కాంట్రాక్టర్లకు లాభాలు, నాయకులకు కమీషన్లు ప్రాతిపదికన అభివృద్ధి నమూనా రూపొందించి అమలు చేయడం వల్ల, రాష్ట్రం ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయింది.
ఇందులో సగం బడ్జెట్ సంబంధిత అప్పులయితే, మరో సగం మిషన్ భగీరథ , కాళేశ్వరం లాంటి కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన రుణాలు. దీర్ఘకాలానికి ఎక్కువ వడ్డీలతో తెచ్చిన ఈ ఋణాలు, అనుకున్న ఫలితాలను సాధించకపోగా, బడ్జెట్ కేటాయింపులలో సింహ భాగాన్ని తినేస్తున్నాయని కాగ్ నివేదికలే చెబుతున్నాయి.
గత తొమ్మిదేళ్లలో జిఎస్టి , అమ్మకం పన్ను, ధరణి , ఇతర సర్వీసు ఫీజుల రూపంలో ప్రజలపై పన్నుల భారం భారీగా పెరిగిపోయింది. పెరిగిన విద్యుత్, రవాణా ఛార్జీలు కూడా సాధారణ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడేలా మద్యాన్ని ఏరులై పారిస్తూ, ఆదాయం కోసం ప్రధానంగా ఎక్సైజ్ పన్ను పై ఆధార పడడం ఈ ప్రభుత్వ దివాళా కోరు తనానికి నిదర్శనం.
ఆర్టీసీ,విద్యుత్ ట్రాన్స్ కో సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించక పోవడంతో ఆయా కార్పొరేషన్ లు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఆరోగ్యశ్రీ,, ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాలకు బకాయిల వల్ల ఆయా వర్గాల ప్రజలకు ఉచిత సర్వీసులు అందడం లేదు.
ఈ ప్రభుత్వానికి వివక్షకు గురయ్యే సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం అందించాలన్న నిజమైన ఎజెండా లేదు. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి కొనుగోలు చేసి ఇచ్చే జీవో నంబర్ 1 పక్కకు పడి పోయింది. దళిత బంధు పథకం ఇప్పటి వేగంతోనే కొనసాగితే, దశాబ్ధాలు గడిచినా ఆశించిన ఫలాలు అందవు. సమాజంలో 54 శాతం ఉన్న వెనుకబడిన వర్గాల ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయింపులు అతి తక్కువగా ఉంటున్నాయి. ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇవ్వనే లేదు.మైనారిటీల సంక్షేమం కోసం సుధీర్ కమిషన్ చేసిన సిఫారసుల అమలు ప్రారంభించనే లేదు.
సమగ్ర వ్యవసాయ విధానమూ, రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా పంటల ప్రణాళికా లేకపోవడం వల్ల మెజారిటీ గ్రామీణ వ్యవసాయ కుటుంబాలలో సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. సమాజంలో మెజారిటీ గా ఉన్న గ్రామీణ రైతాంగ సంక్షేమం లక్ష్యంగా రైతు బంధు లాంటి పెట్టుబడి సహాయ పథకాలు అవసరమే. కానీ ఈ పథకం పేరుతో, ఒక వైపు వ్యవసాయం చేయని రైతులకు, వ్యవసాయం చేయని భూములకు, బడా భూస్వాములకు కూడా ప్రతి సంవత్సరం వేల కోట్లు పంపిణీ చేస్తూ నిధులను వృధా చేస్తున్నారు. మరో వైపు కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా సహాయం అందించడం లేదు.
రైతుల పంట రుణాల మాఫీ సరిగా సకాలంలో చేయలేదు. బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలపై వడ్డీ రాయితీ బకాయిలు చెల్లించడం లేదు. ఫలితంగా రైతులకు సంస్థాగత రుణాలు అందడం లేదు. పంటల బీమా పథకాలను అమలు చేయడం లేదు. , ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కూడా అందించడం లేదు.
రాష్ట్ర GSDP 13 లక్షల కోట్లకు చేరిందనీ, సగటు తలసరి ఆదాయం 3 లక్షల రూపాయలు దాటిందనీ, ప్రభుత్వం చెప్పే మాటలు పాక్షిక సత్యం మాత్రమే. సాధారణ ప్రజల నిజ ఆదాయలు, జీవన ప్రమాణాలు ఏ మేరకు పెరిగాయి, ఐక్య రాజ్య సమితి నిర్వచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు రాష్ట్రం ఎంత ప్రయాణించింది అన్నది ముఖ్యం. ఈ విషయం పై NSSO, HDI నివేదికలు, ప్రభుత్వ ప్రచార బండారాన్ని బయట పెడుతున్నాయి.
సమాజంలో ఆర్ధిక అసమానతలు గణనీయంగా పెరుగుతున్నాయి. NCRB నివేదికల ప్రకారం వివిధ కారణాలతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అకాల, అసహజ, అనారోగ్య మరణాలు పెరుగుతున్నాయి. గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వ రంగ ఉద్యోగ ఖాళీల భర్తీ చేయక పోవడంతో రాష్ట్ర ఉన్నత విద్యా వంతులలో నిరుద్యోగం బుసలు కొడుతున్నది. విద్యా రంగ ప్రమాణాలు పూర్తిగా దిగ జారడంతో , యువతకు నైపుణ్య శిక్షణలు లేక పోవడంతో, రాష్ట్రంలో ఏర్పడుతున్న పరిశ్రమలలో, సంస్థలలో స్థానిక యువతకే ఉద్యోగాలు దొరుకుతాయన్న గ్యారంటీ లేకుండా పోయింది.
రాష్ట్ర సహజ వనరుల సద్వినియోగం పై ఈ ప్రభుత్వానికి పట్టింపే లేదు. రాష్ట్రానికి భూ వినియోగ విధానం లేదు. ఫలితంగా ఆన్ని జిల్లాలలో లక్షలాది ఎకరాల సాగు భూమి రియల్ ఎస్టేట్ వెంచర్లు గా మారిపోతున్నది. మరో వైపు ప్రభుత్వమే, అవసరం లేకపోయినా రీజనల్ రింగ్ రోడ్డు, నగరాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్లు, ఆహార శుద్ధి పరిశ్రమల పేరుతో భూములను కబళిస్తున్నది.
ఈ ప్రభుత్వ విధానాలలో పర్యావరణ స్పృహ కూడా అతి తక్కువ. ఒక వైపు హరిత హారం పేరుతో మొక్కల పెంపకం పై ప్రచారం చేస్తూ, మరో వైపు, ఇప్పటికే లక్ష ఎకరాల అటవీ భూమిని ప్రాజెక్టుల పేరుతో మళ్లించింది. స్థానిక అధికార పార్టీ నాయకులు సాగించే ఇసుక దందా, కొండలను, గుట్టలను విధ్వంసం చేస్తూ సాగిస్తున్న క్వారీ,మైనింగ్ దందా, హైదరాబాద్ నగర మంచినీటి వనరులకు, పర్యావరణానికి హాని చేస్తూ జీవో 111 రద్ధు, రైతులనుండీ భూములను గుంజుకుని అత్యంత కాలుష్య కారక ఔషధ నగరాన్ని ప్రజల నివాస ప్రాంతాల మధ్యలో నిర్మించడం లాంటివన్నీ ఇందుకు పెద్ద నిదర్శనం.
కేవలం దశాబ్ధి ఉత్సవాల ప్రచారానికి పరిమితం కాకుండా, రానున్న అసెంబ్లీ ఎన్నికల లోపు ఆయినా, ప్రభుత్వం తన పాలనా స్వభావాన్ని మార్చుకుంటుందని ఆశించ వచ్చా ?
Comments
Post a Comment