*బీసీల్ని మభ్యపెడుతూ, వాస్తవాల నుండి దారిమళ్ళించే లా అవాస్తవాల్ని, అర్ధసత్యాల్ని, వాస్తవ వక్రీకరణల్ని, కల్పితాల్ని ప్రచారం చేసేవారంతా బీసీలకు శత్రువులే.*
-
1. *"బీసీ రిజర్వేషన్ల చరిత్ర తెలుసుకోండి"* అనే శీర్షికతో నిన్న కొన్ని బీసీ గౄపుల్లో ఒక పోస్ట్ సర్కులేట్ అయింది. ఇది మొదటి సారి కాదు. వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో "ఇదే పోస్ట్" గతంలో కూడా పలుమార్లు చక్కర్లు కొట్టింది. ఒక లక్ష్యంతోనే, ఎవరో పనిగట్టుకుని, అసత్యాలు, అర్ధసత్యాలు, వాస్తవ వక్రీకరణలు, కల్పితాలతో దట్టించ బడిన ఈ పోస్ట్, అంబేద్కర్ గారు బీసీలకు ఏదేదో చేసేసారు అని, భ్రమ పడే విధంగా రూపొందించడం, దాన్ని పదేపదే ప్రచారంలో పెట్టడం, బీసీల్ని ప్రభావితం చేసి, వారి ఆలోచనల్ని ప్రభావితం చేసి, దారి మళ్ళించ డానికే కావచ్చు అనిపిస్తుంది. ఇది అభ్యంతరకరం.
2. బీసీలకు మేలు చేసినంత వరకు, అంబేద్కర్ గారిని బీసీలు కూడా కృతజ్ఞతా భావంతోనే అభిమానిస్తారు. అయితే ఈవిధంగా జరుగుతున్న ప్రచారం లోని డొల్లతనం అర్థం అయినపుడు మాత్రం, బీసీలు ఈ ప్రచారం వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఖచ్చితంగా శంకిస్తారు. అవసరం అయినపుడు నిలదీస్తారు. విద్యా పరంగా వెనుక బడిన బీసీలకు అధ్యయనం, పరిశోధన చేసే అలవాటు, కొంచెం తక్కువ. వారిలో ఈ సంస్కృతి బలంగా ఎదగ లేదు. అందుచేత, స్వార్థ ప్రయోజనాల కోసం, ఇతరులు ప్రచారంలో పెట్టిన అసత్యాలు, అర్ధసత్యాలు, వాస్తవ వక్రీకరణలు, కల్పితాలు, బీసీల్ని బాగా ప్రభావితం చేస్తాయి. దారి తప్పిస్తాయి. ఇది సామాజిక ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. బీసీలు, అసలైన వాస్తవాలకు దూరం అయ్యే అవకాశం కూడా ఉంది.
3. ఈ సందర్భంగా ఇటువంటి అసత్య ప్రచారానికి దిగజారుతున్న మిత్రులు గుర్తించు కోవలసిన ఒక ముఖ్య కోణం ఏమిటంటే, స్వయంగా అంబేద్కర్ గారే, తాను నాయకత్వం వహించి, రచనా ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన "రాజ్యాంగం" లో, బీసీలకు ఎటువంటి రక్షణ సూత్రాలు పొందుపరచ బడనందుకు విచారం వ్యక్తంచేశారు. ఈ వాస్తవాన్ని ఆయన "తన రచనలు, ఉపన్యాసాలు", Vol.14, Part Two, page 1319, చివరి పేరాలో నమోదు చేశారు. (ఇంగ్లీష్ ఎడిషన్ - 1995)
4. ఇక అభ్యంతర కరమైన పై సందేశంలో ని అసంబద్ధ ప్రస్తావన ల గురించి :
I). *బీసీలకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది అంబేద్కర్ గారే నా ?* ఎలా, ఏం రాజకీయ భవిష్యత్తు, ఆయన బీసీ లకు తన రాజ్యాంగం ద్వారా ఇచ్చారు చెప్పండి ? ఆయన రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కేవలం ఎస్సీలకు మాత్రమే, బీసీలకు ఎటువంటి రాజకీయ భవిష్యత్తును అంబేద్కర్ గారు ఇవ్వలేదు. ఇచ్చే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీల కు మాత్రమే చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప, బీసీల కు ఎక్కడ ఉన్నాయి ? లేవే ! మరి బీసీలకు అంబేద్కర్ గారు ఎటువంటి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినట్లు ? చెప్పండి ?
ii) SC, ST ల కంటే ముందే, "OBC రిజర్వేషన్లు - 52%" ఆర్టికల్ 340 ద్వారా అంబేద్కర్ గారు రాసి పెట్టారా ? ఏం కల్పితాలు, ఏం ఊహా గానాలు ఇవి ? అసలు ఈ ఆర్టికల్ 340 ని కనీసం ఒకసారైనా చూసారా ? దేని కోసం, ఈ ఆర్టికల్ 340 ని, రాజ్యాంగంలో పొందుపరచారో అర్ధం చేసుకొన్నారా ? అంబేద్కర్ గారే ఈ ఆర్టికల్ 340 ని మొదటిగా రూపొందించారని ఎవరైనా చెప్పగలరా ? OBC లకు 52% రిజర్వేషన్లు అని ఈ ఆర్టికల్ 340 లో ఎక్కడ ఉంది ? ఎందుకు ఉంటుంది ? ఏ వర్గానికి, ఎంత శాతం రిజర్వేషన్లు ఉండాలి అనేదాన్ని, రాజ్యాంగ సూత్రాలకు, కోర్టు తీర్పుల సూత్రాలకు లోబడి, ప్రభుత్వాలు నిర్ణయిస్తాయే తప్ప, రాజ్యాంగం నిర్దేశించదు, అనే అవగాహన కూడా లేని వారే, ఈ కల్పితాల్ని అల్లి ఉంటారని అనుకోవాలి.
iii) అంబేద్కర్ గారు బీసీలకు 52% రిజర్వేషన్ రాసిపెడితే, గాంధీ నెహ్రూ, పటేల్ ని గిల్లారా ?
గిల్లి, OBC లేంటి ? ఆ కేస్ట్ లిస్టు లేదు కదా, అదికుదరదు అని చెప్పించారా ? "ఈ గిల్లుడు" ఏంటీ ? ఎవరు చూసారు ? గాంధీ, నెహ్రూ లు వేసినట్లు అల్లబడిన ఈ ప్రశ్నలను ఎవరు విన్నారో సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే సమాజం ముందు ఉంచవచ్చు కదా ? అమాయక బీసీల చెవుల్లో, ఈ కల్పితాలను ఊదడం దేనికి ?
iii) అయినా "అంబేద్కర్" ఒప్పుకోకుండా, బీసీ కమిషన్ వేసి, వెంటనే కేస్ట్ లిస్టు తయారు చేసి, బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఆర్టికల్ 340 లో రాసారు అంటారు. ఇది ఎంత అసంబద్ధ మైన ఊహాగానం ? బీసీ సమస్యల పరిష్కారం కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగ చట్ట సభకు పోవాలని ఏనాడూ ఆలోచించలేదు. అయితే అస్పృశ్యుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం మాత్రమే రాజ్యాంగ చట్టసభకు తాను వచ్చినట్లు, అనేక సందర్భాల్లో అంబేద్కర్ గారు స్పష్టత ఇచ్చారు. ఇది సహజమే. దీంట్లో ఎవరికీ ఇబ్బంది లేదు. అయితే పైన ఉటంకించిన సందేశం, అంబేద్కర్ గారు, బీసీల హక్కుల కోసం అలా చేసారు, ఇలా చేసారు అనే ధోరణిలో, ఎటువంటి రుజువులు ఉటంకించ కుండా, నడవడం మాత్రం బీసీలు ఒప్పుకొనే పరిస్థితి లేదు.
iv) ఆర్టికల్ 340 ని మొదటి గా రూపొందించింది, ఆనాడు, రాజ్యాంగ చట్ట సభ అడ్వయిజరీ కమిటీ కి ఛైర్మన్ గా ఉండిన పటేల్ గారు, అంబేద్కర్ గారు కాదు. [ Ref. India's Silent Revolution, by Christophe Jaffrelot, p 219 ] సభ చర్చించి, ఆమోదించిన తర్వాత ఇది రాజ్యాంగం లో చేర్చబడింది. ఇది కూడా జరగడానికి మూల కారణం, 13-12-1946 నాడు, నెహ్రూ రాజ్యాంగ చట్టలో ప్రవేశ పెట్టిన, 8 పేరాల నిడివి కలిగిన "లక్ష్య స్పష్టత" "Objectives Resolution" లోని పేరా 6 లోని వాగ్ధానం. "అల్పసంఖ్యాక వర్గాలకు, వెనుక బడిన, ఆదివాసీ ప్రాంతాలకు, డిప్రెస్డ్ మరియు *ఇతర వెనుక బడిన తరగతుల వారికి* అవసరం అయిన రక్షణ సూత్రాలు రాజ్యాంగం లో పొందు పరుస్తాం" అనేది 6 వ. పేరాలోని వాగ్ధానం. దీని ప్రకారమే ఆర్టికల్ 340, రాజ్యాంగం లో పొందు పరచబడింది అనుకోవాలి తప్ప, అంబేద్కర్ గారు కృషి చేసి చొప్పించారు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఏమీ లేవు.
v) (a). ఈ ఆర్టికల్ 340 వలన బీసీలకు ఏదో ఒరిగి పోయినట్లు గా ఎవరూ భావించ వలసిన అవసరం లేదు. ఎందుకంటే దీని వలన కొత్త హక్కులు ఏమీ బీసీలకు సంక్రమించ లేదు. ఒక కమిషన్ ఏర్పాటు కోసం మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఈ ఆర్టికల్ 340 లేకపోయినా కూడా, ఇటువంటి కమిషన్ ఏర్పాటు చేసుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. Commission of Inquiry Act, 1952 కిందగాని, Article 16 (4) కింద కాని ఇటువంటి కమిషన్ ను నియమించడానికి వీలు అవుతుంది. ఈ విషయాన్ని కొన్ని కోర్టు తీర్పులు కూడా స్పష్టం చేశాయి. 1968 లో, "అనంత రామన్ కమిషన్", నియామకం 1952 చట్టం ప్రకారమే జరిగింది.
v) (b) "సామాజిక వెనుక బాటుతనం, విద్యాపరమైన వెనుక బాటుతనం తో బాధపడుతున్న వర్గాల స్థితి గతులను అధ్యయనం చేసి, అటువంటి స్థితినుండి ఉపశమనం కోసం, ఎటువంటి నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలి, అనేదాని మీద సిఫార్సులు చేయడానికి, ఒక కమిషన్ ను దేశాధ్యక్షుడు, తన ఆదేశాల ద్వారా నియమించ వచ్చని, ఈ ఆర్టికల్ 340 నిర్దేశిస్తుంది. అంతే. దామాషా అవకాశాలకు ఇది భరోసా ఇవ్వదు. మరో విధంగా పోరాడి సాధించుకోవలసిందే. ఈ 340 ద్వారా నియమించ బడిన కమిషన్ వల్ల ఓబీసీలకు ఒక "కమిషన్ స్థాయి గుర్తింపు తప్ప", ఎస్సీ ఎస్టీలకు దొరుకు తున్నటువంటి "రాజ్యాంగ ప్రతిపత్తి గుర్తింపు" లభించదు. ఆవిధంగా బీసీలు, ఆర్టికల్ 340 ద్వారా నష్టపోయేరే తప్ప, చెప్పుకోదగ్గ లబ్ధి ఏమీ అదనంగా పొందలేదు.
v (c) రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ, 12 రోజులు తక్కువగా 3 సంవత్సరాలు నడిచింది. ఈసమయంలోనే, రాజ్యాంగ నిర్మాణ ప్రారంభ దశలోనే, 50% పై జనాభా కలిగిన బీసీల గుర్తింపు, రాజ్యాంగ చట్ట సభ ఆధ్వర్యంలో నడిచి ఉంటే, "బీసీల గుర్తింపుకు రాజ్యాంగ ప్రతిపత్తి" ఉండేది. "వారి ప్రతినిధులకు రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ లో భాగస్వామ్యం దొరికి ఉండేది". ఇవేమీ జరగలేదు. ఇదంతా ఒక కుట్రలో భాగంగానే జరిగిందే, యాదృచ్ఛికం కాదు, అని "బీసీలు" ఎందుకు నమ్మ కూడదు అనే ఆలోచనలో పడ్డారు. *బీసీలకు ప్రాతినిధ్యం లేకుండానే, రాజ్యాంగ చట్ట సభ ద్వారా, రాజ్యాంగ నిర్మాణం జరిగి పోయింది.* ఇది సామాజిక న్యాయం కాదే ? అందుచేతనే ఆర్టికల్ 340 వలన, బీసీలకు ప్రత్యేకంగా ఒరిగి పోయింది ఏమీలేదు అని చెప్పవలసి వస్తుంది. బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా, అంబేద్కర్ నాయకత్వం లో రూపొందిన రాజ్యాంగం లో, బీసీలకు కీలకమైన రాజకీయ న్యాయం జరగలేదు అంటున్నాం. ఇతర రంగాల్లో దామాషా అవకాశాలకు బీసీలు దూరం అవుతున్నారు అంటున్నాం. ఇవి వాస్తవాలు కాదు అని ఎవరైనా చెప్పదలచుకుంటే రుజువులు కావాలి అంటున్నాం.
5. ఆ తర్వాత, అంటే (బీసీలకు సంబంధించిన ఆర్టికల్ 340 తర్వాత అని వీరి ఉద్దేశం) ఆర్టికల్ 341 (SC), 342 (ST) ల వారికి దామాషా ప్రకారం 15% , 7.5% రిజర్వేషన్ లు ఇచ్చారు. నిజమే.
ముందు ఆర్టికల్ 340 ద్వారా బీసీలు మాత్రమే, 50% సీలింగ్ రూలుకు బలై, దామాషా అవకాశాలకు దూరం అవుతున్నారు తప్ప, తర్వాత ఆర్టికల్ ద్వారా దొరికిన కారణం చేత ఎస్సీ, ఎస్టీలు ఏవిధంగానూ నష్ట పోవడం లేదు కదా ? వారి దామాషా అవకాశాలు సూత్ర బద్ధంగా వారికి దొరుకుతున్నాయి కదా ? అటువంటప్పుడు ఈ "ముందు, వెనకల" ప్రస్తావన దేనికి ?, అమాయక బీసీల్ని మభ్యపెట్టడం ఆంతర్యం కాకపోతే. 50% రిజర్వేషన్ సీలింగ్ రూలు, ఎస్సీ ఎస్టీల లో ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదు, EWS 10% రిజర్వేషన్ విషయంలో ఆధిపత్య కులాలు ను కూడా సీలింగ్ ఇబ్బంది పెట్టలేదు కదా? బలి అవుతుంది కేవలం బీసీలే కదా ?
అంబేద్కర్ గారే కాదు, బీసీల్ని పూర్తిగా ఉద్ధరించింది ఎవరూ లేరు.
6. అంబేద్కర్ 27-9-1951 నాడు నెహ్రూ మంత్రివర్గం నుండి రాజీనామా చేయడానికి, అంబేద్కర్ గారే చెప్పిన *ప్రధాన కారణాలు రెండే రెండు*.
*మొదటిది* : సమాజం మొత్తం ప్రచారంలో ఉన్న హిందూ కోడ్ బిల్లుకు, ప్రభుత్వం మద్దతు ఉపసంహరించు కోవడం.
*రెండవది* : విధాన నిర్ణయాల నన్నిటినీ నిర్దేసిస్తున్న కేబినెట్ కమిటీలు దేంట్లో నూ, తనను (అంబేద్కర్ గారిని) నియమించక పోవడం.
ఈ రెండు ప్రధాన కారణాలు కాక అంబేద్కర్ గారు తన రాజీనామా పత్రంలో, తానే ప్రకటించిన *3 అప్రధాన కారణాల్లో* ఒకటి, "బీసీ, ఎస్సీ ఎస్టీల ప్రయోజనాల" విషయం, ప్రభుత్వం నిర్లక్ష్యం తో వ్యవహరిస్తున్న దని. అంతే తప్ప, "అంబేద్కర్ ఎన్నిసార్లు కోరినా, పట్టుబట్టినా, నెహ్రూ, బీసీ కమిషన్ వెయ్యలేదని అంబేద్కర్ గారు ప్రత్యేకంగా తన రాజీనామా లేఖ లో ఎక్కడా పేర్కొనలేదు".
అంబేద్కర్ రాజీనామా ప్రకటన ఆయన Writings and Speeches Vol 14, part two pp 1317-1327 లలో చూడవచ్చు. దీనిమీద నా విశ్లేషణ ను, 2007 లో ప్రచురితమైన నా వ్యాస సంకలనం *"ఈ శతాబ్ది బీసీ వాదం"*, పుస్తకంలో, "మూల్ నివాసి" సిధ్ధాంతం పై, నా ఉపన్యాస వ్యాసంలో, పేజీలు, 127-139 మధ్య ఉంటుంది.
7. తరువాతి కాకా కలేల్కర్ నియామకం, వారి నివేదిక బుట్ట దాఖలు కావడం, అది పార్లమెంటు లో చర్చకు కూడా రాకపోవడం, తదుపరి 1980 లో మండల్ కమిషన్ నివేదిక ఇందిరా గాంధీ హయాంలో అమలుకు నోచుకోకుండా అటకెక్కిడం, వీపీ సింగ్ తన హయాంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ రంగంలో, 13-8-1990 నాటి మెమో ద్వారా, బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రకటించిన నిర్ణయం తీసుకొన్న పాపానికి బీజేపీ "కమండల" ప్రతీఘాత ఉద్యమం నడిపి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని, ప్రభుత్వాన్ని పడగొట్టి, వీపీ సింగ్ మీద కక్ష తీర్చుకోవడం, ఇదంతా చరిత్ర లో భాగం. బీసీల అనుభవంలో ఉంది.
8. అయితే ఆనాటి అత్యున్నత విద్యావంతుల్లో అంబేద్కర్ గారు ప్రధమ స్థానంలో ఉంటారు. ఆయన "కులం అణచివేత" ఎలా ఉంటుందో స్వయంగా తన జీవిత కాలంలో అడుగడుగునా, అనుభవించిన వారు. ఆయన కులనిర్మూలన సిధ్ధాంత గ్రంధం అమోఘమైన రచన. కుల బాధితులకు ఆయన గ్రంధం ఒక ఆశాదీపిక. అయితే దేశ జనాభాలో 50% పైనున్న బీసీలు కూడా కులవ్యవస్థ పీడితులే కదా ? మరి బీసీల సాధికారత కోసం, "తన జనాలు పాలకులుగా ఎదగాలని ఆశించిన అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో నడిచిన రాజ్యాంగంలో, బీసీలకు రాజకీయ న్యాయం కోసం, చట్టసభల్లో బీసీరిజర్వేషన్ల కోసం, ఆయన ఎటువంటి ప్రతిపాదనలు కూడా చేయక పోవడం, బీసీలకు ఆవేదన కలిగించదా ? మరి ఆయన పోరాటం సంగతి అటుంచి, కనీసం ప్రతిపాదన కూడా ఎందుకు చేయలేకపోయారు అని బీసీలు ఆలోచించడం తప్పు కాదు కదా ?
9. ఇక పంచాయతీ వ్యవస్థలో బీసీల రిజర్వేషన్ ల సంగతి. 73, 74 రాజ్యాంగ సవరణ ల తర్వాత, 1995, 2001, 2006, 2012 లలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అనుభవించిన *బీసీలు* దరిమిలా జరిగిన, జరగబోయే ఎలక్షన్ల లో తమ రిజర్వేషన్లు 24% కి గణనీయంగా తగ్గి పోవడానికి రాజకీయ నాయకుల కంటే, 11-5-2010 నాటి, సుప్రీంకోర్టు తీర్పే మూల కారణం అని, ఆ తీర్పుని, పదవీ విరమణకు ఒకరోజు ముందు నాటి దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జీ. బాలకృష్ణన్ గారి రాజ్యాంగ ధర్మాసనం, ఆయన రిటైర్మెంట్ కు ఒకరోజు ముందు ఇచ్చిన తీర్పు కారణం అని బీసీలు తెలుసు కోలేరా ? ఆధిపత్య కులాల వారికి కూడా వర్తించని 50% సీలింగ్ ని బీసీల మీదే ప్రయోగించడం ఒక కక్షగా కాక బీసీలు ఎలా అర్థం చేసుకోవాలి ?
10. "విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ లు తక్కువ సీట్లకే పరిమితం కావాలి" అని రాజ్యాంగ నిర్మాణ చట్టసభలో తన అభిప్రాయం గా చెప్పిన "అంబేద్కర్ గారి అభిప్రాయాన్ని [ C.A.D. Vol. 7, p 701 ] ఒక ప్రమాణం గా, తీసుకుని", మండల్ కేసు తీర్పు, పేరా 808 లో రిజర్వేషన్లు 50% దాటకూడదని సీలింగుని, పునరుద్ఘాటించడం, బీసీలు దామాషా అవకాశాలు పొందలేక పోవడానికి కీలక మూలకారణం, అని, బీసీలు ఎంతకాలం తెలుసు కోకుండా ఉంటారు ? అయినా అంబేద్కర్ గారు బీసీలకు ఏదేదో చేసేసారని ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నట్లో అర్ధం కావాలి. ఈ కోవ ప్రచార కర్తలు, పంచాయతీ, మునిసిపాలిటీ సంస్థల్లో కూడా బీసీ రిజర్వేషన్లు గణనీయంగా తగ్గి పోవడానికి, కారణం, 2010 నాటి *జస్టిస్ కె.జీ. బాలకృష్ణన్ గారి తీర్పే కారణం*, రాజకీయ పార్టీల ప్రమేయం అంతగా లేదు, అని ఎంతకాలం తెలుసుకోకుండా ఉంటారు ?
కొండలరావు
1-6-2023
[ బీసీలకు ఈ సందేశం ఉపయోగ పడుతుంది, అని మీరు భావిస్తే, ప్రతీ బీసీ ఇంటికి ఈ సందేశం చేరేలా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సందేశాన్ని షేర్ చేయండి. ]
Comments
Post a Comment