టి.చిరంజీవులు ఐఏఎస్(రిటైర్డ్) మరియు చైర్మన్, బిసి ఇంటలెక్చువల్స్ ఫోరమ్, తెలంగాణ |
“పుట్టుకతో మనిషి స్వేచ్చాజీవి, కానీ ప్రతి అడుగులో అతను సంకెళ్లతో బంధించబడ్డాడు” అని ఫ్రెంచ్ విప్లవ కవి మరియు తత్వవేత్త “రూసో” ఈ మాటలు చెప్పినప్పుడు అతను వర్ణవ్యవస్థలో బానిసతనం చవిచూసిన భారతీయులను ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఆయన మాటలు ఈ దేశంలోని కోట్లాది బహుజనుల జీవన గాథలను అక్షరాలా వర్ణించాయి.
భారతదేశంలో పుట్టుకే పాపమై, కులమే శాపంగా మారిపోయిన వారు శూద్రులు, అతి శూద్రులు. మానవ హక్కుల నుంచి దూరం చేయబడి దాస్యశృంఖలాల్లో బంధించబడి వేల ఏళ్లుగా “సేవ చేయడమే నీ ధర్మం” అనే జెండా కింద అణచివేయబడ్డారు. మనుధర్మ శాస్త్రము, బ్రాహ్మణ ధర్మ వ్యవస్థ, రాజరికాల చేతిలో బహుజనులు కేవలం ఒక విలువ లేని శ్రామికులుగా మిగిలిపోయారు.
భారతీయ సామాజిక వ్యవస్థ వేల సంవత్సరాలుగా మనుషుల్ని వర్ణము, కులము పేరుతో విడదీసి అగ్రవర్ణాల చేతిలో శూద్రులను, అతిశూద్రులను అతి క్రూరంగా అణచివేసి వారికి మానవ హక్కులు లేకుండా చేసి నిర్ధాక్షిణ్యముగా దోపిడీకి గురిచేసింది. మను ధర్మశాస్త్రం శూద్రులను మిగతా మూడు వర్ణాలకు సేవకులుగా పేర్కొంది. అలాగే “న స్త్రీ స్వాతంత్ర మర్హతే” అంటే స్త్రీకి స్వాతంత్ర్యం అవసరం లేదు అని వ్యాఖ్యనించింది. శూద్రులను, మహిళలను బానిసలుగా మార్చింది.
అలాగే, ఋగ్వేదంలోని పురుష సూక్తంలో ప్రజాపతి (బ్రహ్మ) నోటి నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టినట్లు పేర్కొనడం జరిగింది. ఈ వర్ణ వ్యవస్థలో “అతి శూద్రులకు” స్థానం లేకుండా చేసారు. నిజంగా భగవంతుడు మానవాళిని సృష్టించినవాడే అయితే ఒక్కరిని ఎక్కువగా, ఒక్కరిని తక్కువగా ఎందుకు సృష్టిస్తాడని మహానేత “మహాత్మా పూలే” గారు ప్రశ్నించారు. అంతేగాక, ఇలా వివక్షతో సృష్టించే దేవుడు, దేవుడే కాదని, ఆ దైవత్వాన్ని కూడా సూటిగా ప్రశ్నించారు.
వాస్తవానికి భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. కానీ బ్రాహ్మణులు తమకు జ్ఞానానికి, వనరులను నియంత్రణలో పెట్టుకొని అబద్ధపు సిద్ధాంతాలను మత గ్రంథాలలో చొప్పించి వర్ణవ్యవస్థను శాశ్వతం చేశారు. కేవలం తమ సామాజిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అనేక రకాల కుటిల విధానాలను, సిద్ధాంతాలను దుష్ప్రచారములను రూపొందించి అమలు చేశారు. వాటిలో ముఖ్యమైనది కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం గతజన్మలో చేసిన కర్మల (పాపాల) వల్లే కొందరు నిమ్నకులాలలో పుడతారని నమ్మబలికి శూద్రులు మరియు అతి శూద్రులను బానిసలుగా మార్చారు. హైందవ ధర్మశాస్త్రాలు శూద్రులకు విద్యను నిషేధించాయి. తద్వారా ఏర్పడిన అవిద్య, అజ్ఞానము వలన శూద్రులు ఈ నమ్మకాలను నిజమేనని విశ్వసించి దాస్య జీవితాన్ని అనివార్యంగా కొనసాగించారు. ఈ కర్మ, పునర్జన్మ నమ్మకాలు నేటికీ శూద్రుల మనసుల్లో నుండి పోవడంలేదు. ఇవే వారిని ఎదగకుండా అడ్డుపడుతున్నాయి. శూద్ర కులాలు ఈ మతచాందస వాదాల నుంచి బయటపడినప్పుడే తమకు న్యాయంగా చెందాల్సిన హక్కులను సాధించగలుగుతారు. అప్పుడే సామాజిక న్యాయం వారికి చేరువవుతుంది.
అలాగే, బ్రాహ్మణీయ మతం తెచ్చిన ఇంకో వాదన “చేతి వేళ్ళు అన్నీ సమానం కావు, అందువల్ల మనుషులందరూ సమానం కారు” అన్న వితండవాదం. ఇదే నిజమైతే, మరి మనుషులందరి రక్తం ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది? బ్రాహ్మణులకు ఏదైనా ప్రత్యేకమైన రక్తరంగు ఉందా? శాస్త్రపరంగా రక్తం నాలుగు గ్రూపులు A, B, AB, O లుగా ఉంటుంది. ఈ రక్తగ్రూపులన్నీ బ్రాహ్మణుల్లోనూ, ఇతర కులాల్లోనూ ఒకేలా కనిపిస్తాయి. అంతేకాకుండా, బ్రాహ్మణులూ ఇతరుల్లాగే మాతృగర్భం నుంచే పుడతారు. వారేమీ నోటి నుంచి పుట్టరు. వారికున్న శరీర అవయవాలు ఇతరులకున్న లాగానే ఉంటాయి. పుట్టడం అనేది బయోలాజికల్ ప్రక్రియ; కానీ కులం మాత్రం అగ్రవర్ణాలు సృష్టించిన కృత్రిమ నిర్మాణం. ఈ రెండింటికి పొంతన ఉండదు.
ఐదు వేళ్లూ కలిస్తేనే బలమైన పిడికిలి. అలాగే సమాజములో అన్ని వర్గాలూ సమానత్వంతో కలిసి మెలిసి ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ఈ వివక్షత, వితండవాదాలతో, మత అహంకారంతో అనేక దురాచారాలు, ఘోర సంఘటనలు జరిగాయి - చివరికి అన్యమతాల చేతిలో ఓటమి, పరాయి పాలన మతమార్పిడులు, దేశవిభజన కూడా! ఇంకా ఈరోజుకు కూడా ఈ చిచ్చు చల్లారలేదు.
ఇప్పటికైనా అగ్రవర్ణ పెద్దలు కళ్లు తెరిచి, ఈ దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుంటూ, వేల సంవత్సరాలుగా అణచివేయబడుతున్న ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన సముచితమైన రిజర్వేషన్లు అన్ని రంగాలలో కల్పించాలి. వారితో సమానముగా ఎదిగే అవకాశాలు, సామాజిక న్యాయం కల్పించాలి. అదే ఈ దేశానికి నిజమైన ఆధునికత, నిజమైన మానవత్వం.
ఆత్మగౌరవం లేని జీవితం – మృత్యువుతో సమానం
ఆత్మగౌరవం అంటే ఏమిటి? ఆత్మగౌరవం అంటే వ్యక్తి తన మీద తనకు గౌరవం ఉండడం, స్వాభిమానం కల్గి ఉండడం, ఇంకొకరికి గులాముగిరి చేయకుండా, యాచించకుండా గౌరవప్రదంగా, హుందాగా బ్రతకడం. ఆత్మగౌరవం ఉంటేనే ఎదుటివాడు గౌరవిస్తాడు లేనట్లయితే మనిషిగా కూడా గుర్తించడు. అతనికి అస్తిత్వం, విలువ ఉండదు. ఇతరుల వద్ద బానిసలుగా బ్రతకాలి. ఆత్మగౌరవం అనేది మానవుని జీవన హక్కుల్లో అత్యంత ప్రాథమికమైనది. అది భౌతిక సంపదతో కొలవలేం. అది పదవులతో రాదు. అది “యాచనచే రాదు పోరాటానికి ఫలంగా వస్తుంది.” తన నిర్ణయాలను తానే తీసుకోవడం, తన ప్రతినిధిని తానే ఎంచుకోవడం, తన గొంతును తానే వినిపించడం – ఇవే ఆత్మగౌరవం సంకేతాలు.
“జీ హుజూర్, బాంచను దొర సంస్కృతి”
నిజాం రాజ్యములో పై సామాజిక వ్యవస్థకు అతి క్రూరమైన ఫ్యూడల్ ఆర్థిక వ్యవస్థ తోడై “జీ హుజూర్” “బాంచన్ కాళ్ళుమొక్కుతా” అనే సంస్కృతి ప్రబలి శూద్రులు, అతిశూద్రులకు ఆస్తులపై హక్కు లేక బానిసలుగ దుర్భరమైన బతుకులు బతకడం జరిగింది. ఇలాంటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక నేపథ్యంలో పుట్టుకొచ్చిన తిరుగుబాటే సాయుధ రైతాంగ పోరాటం(1944 నుంచి1950 వరకు) భూమి, భుక్తి, విముక్తి కొరకు పోరాటం జరిపింది. దున్నేవానిదే భూమి, వెట్టిచాకిరి నిర్మూలన నినాదాలతో పోరాటం కొనసాగింది. నాలుగువేల మంది అమరులైనారు. చివరకు 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడం జరిగింది. ఇక్కడ విముక్తి అంటే ఫ్యూడల్ భూస్వాముల నుంచి విముక్తి పొందడం, వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందడం, స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో బ్రతకడం. అయినా నేటికీ గ్రామీణ ప్రాంతాలలో ఈ సంస్కృతి సజీవంగానే ఉంది. ఆత్మవిశ్వాసాన్ని నింపి ఈ సంస్కృతిని రూపుమాపతే గాని బీసీ ఉద్యమాలు ముందుకు సాగవు.
ఆత్మగౌరవ ఉద్యమం - సామాజిక సమానత్వానికి శంఖారావం
ఆత్మగౌరవం అనే ఉద్యమం దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో 1925లో ప్రారంభమైంది. కుల వ్యవస్థ కారణంగా నలిగిపోతున్న నిమ్న వర్గాలకు సామాజిక సమానత్వాన్ని సాధించేందుకు రామనాథన్ గారు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం, ఈ ఉద్యమానికి ఇ.వి.రామస్వామి నాయకర్ గారిని (పెరియారు) నాయకత్వం వహించమని కోరారు.
పెరియారు నేతృత్వంలో ఆత్మగౌరవ ఉద్యమం వేగంగా విస్తరించింది. ఈ ఉద్యమ ప్రభావం తమిళులు నివసించే శ్రీలంక, మయన్మార్, సింగపూర్, మలేషియా దేశాల వరకూ వ్యాపించింది.
ఈ ఉద్యమ సూత్రాల ప్రకారం - “మనిషి తన ఆత్మగౌరవాన్ని అభివృద్ధి చేసుకుంటేనే అతని వ్యక్తిత్వం వికసిస్తుంది. ఆత్మగౌరవం ఉన్నవాడు ఎప్పటికీ ఇతరులకు గులాంగిరి చేయడు.”
పెరియారు స్పష్టంగా పేర్కొన్న విషయం ఏమిటంటే: “మన దేశం నుండి ఉన్నత-నిమ్న కుల భావనలు పూర్తిగా తొలగినప్పుడే నిజమైన ఆత్మగౌరవం గురించి మనం ఆలోచించగలుగుతాం.” ఆయన రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం అహర్నిశలు పోరాడారు.
తమిళ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించిన డీఎంకే (DMK) మరియు ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీలు తాము ఈ ఆత్మగౌరవ ఉద్యమము నుంచే పుట్టామని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని ప్రకటించుకున్నాయి. ఆ స్ఫూర్తితోనే ఈ పార్టీలు సామాజిక న్యాయాన్ని ప్రధాన ఎజెండాగా మార్చుకుని, రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపాయి. చూపిస్తూనే ఉన్నాయి. అగ్రవర్ణ బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలలో సమానత్వం అనే భావనను బలంగా పంచాయి.
ఈ విధంగా, ఆత్మగౌరవ ఉద్యమం తమిళ సమాజాన్ని మాత్రమే కాదు, భారతదేశంలో సామాజిక చైతన్యాన్ని మేల్కొలిపే శక్తిగా నిలిచింది.
భారత స్వాతంత్ర్య పోరాటం-
నిజానికి, భారత స్వాతంత్ర్య సంగ్రామం కూడా ఒక గొప్ప ఆత్మగౌరవ పోరాటమే. బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడం, స్వతంత్రంగా పాలించుకోవడమే ఆ ఉద్యమ లక్ష్యం. బ్రిటిష్ వారు దేశ ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేశారు, చేతివృత్తులను నాశనం చేశారు, అనేక కరువు కాటకాలకు కారణమయ్యారు. అయినప్పటికీ, వారు కొన్నివిషయాల్లో భారతదేశానికి చేసిన మేలు మరవలేము
అనేక రాజ్యాలతో, సంస్థానాలతో ముక్కలు చెక్కలుగా ఉన్న ఈ దేశాన్ని ఏకీకృతం చేశారు. ఒకే రకమైన పాలన వ్యవస్థను అమలు చేశారు. ఆంగ్ల మాధ్యమ విద్య ద్వారా ప్రపంచ విజ్ఞానానికి తలుపులు తెరిచారు. పాశ్చాత్య భావజాలం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, మానవతా విలువలు, మహిళా సాధికారత వంటి భావనలను పరిచయం చేశారు.
ఆంగ్ల విద్య ప్రభావంతో భారతీయ సమాజంలో సామాజిక చైతన్యం చిగురించింది. రాజారామ్మోహన్రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు పూలే దంపతులు, పెరియార్, శ్రీనారాయణ గురు, బాబా సాహెబ్ అంబేడ్కర్, కందుకూరి వీరేశలింగం వంటి మహానుభావులు సమాజంలోని అనేక దురాచారాలను రూపుమాపేందుకు అహర్నిశలు కృషి చేశారు.
బ్రిటిష్ పాలనలో రైల్వేలు, జాతీయ రహదారులు, నౌకాశ్రయాలు నిర్మితమయ్యాయి. ముంబయి, కలకత్తా, చెన్నై వంటి నగరాలు అభివృద్ధి చెందాయి. అయినప్పటికీ, భారతీయులు స్వయంపాలనకోసం ఉద్యమించారు. “పరాయిపాలన వద్దు”, “స్వాతంత్ర్యం మాకు ముద్దు”, “మా దేశాన్ని మేమే పాలించుకుంటాం” అనే నినాదాలతో బ్రిటిష్ వారి పాలనకు ముగింపు పలికారు. ఇక్కడ అభివృద్ధి కంటే ఆత్మగౌరమే ఎక్కువ ప్రాధాన్యత వహించింది. అయితే - ఈరోజు మనం నిజంగా ఆత్మగౌరవంతో మన దేశాన్ని పాలించుకుంటున్నామా? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న.
ఇప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై వివక్ష కొనసాగుతోంది. రాజ్యాధికారం ఇంకా అగ్రకులాల చేతిలోనే ఉంది. మెజారిటీ ప్రజలకు పాలనా వ్యవస్థలో పాత్ర లేదు. తెల్లదొరలు “దోపిడీ పేరుతో అభివృద్ధి” చేశారని, కానీ నేడు “నల్ల దొరలు అభివృద్ధి పేరుతో దోపిడీ” కొనసాగిస్తున్నారనే తీవ్ర విమర్శలు కూడా గలవు.
స్వాతంత్ర్య పోరాట లక్ష్యం ఆత్మగౌరవంతో కూడిన సమానత్వభరిత సమాజ నిర్మాణమే. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే నేడు మనకు మరొక స్వాతంత్ర్య ఉద్యమం అవసరం - అది రాజకీయ, ఆర్ధిక, సామాజిక అంశాలపై. ఇది సమాన అవకాశాలపై, నిజమైన ప్రజాపాలనపై ఆధారపడిన ఉద్యమం కావాలి.
తెలుగు వారి ఆత్మగౌరవ ఉద్యమం
1983లో ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల భాషకు, సంస్కృతికి సాహిత్యానికి గుర్తింపు లేదని, ఇంకా దేశములో “మదరాసీలు”గానే పిలువబడుతున్నామని “తెలుగువారి ఆత్మగౌరవం” అనే మహత్తర నినాదంతో టిడిపి పార్టీని స్థాపించి, కాంగ్రెస్ ను ఓడించి అధికారాన్ని చేపట్టారు. తెలుగు ప్రజల్లో ఆత్మగౌరవాన్ని రగిలించారు. కానీ ఆ ఉద్యమ ఫలితాలు బీసీలకు చేరింది నామ మాత్రమే. బిసి ల పార్టీ అని చెప్పుకునే అగ్రకుల పార్టీగా మారిపోయింది. వారు, వారి వారసులు మాత్రం అధికారాన్ని, ఐశ్వర్యాలను అనుభవిస్తున్నారు. బీసీలు మాత్రం వారి పల్లకిని మోసే కూలీలుగా మిగిలిపోయారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం
సంయుక్త ఆంధ్రప్రదేశ్లో, అప్పటి ఆంధ్ర పెత్తందారుల పాలనలో తెలంగాణ కొంత మేరకు అభివృద్ధి సాధించినా, నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ – ఆత్మగౌరవ నినాదంతో స్వరాష్ట్రాన్ని కోరుకున్నాం. ఆంధ్రా పెత్తందారుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం గళమెత్తాం. ఈ ఉద్యమంలో అభివృద్ధి కన్నా ఆత్మగౌరవమే ప్రధాన బలంగా నిలిచింది. కానీ, ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమంలో బీసీలకు మాత్రం రాజ్యం రాలేదు. సామాజిక తెలంగాణా కల నెరవేరలేదు. అందరి త్యాగాలు చివరికి వృథా అయ్యాయనే తార్కిక విచారం మిగిలింది.
భారత రాజ్యాంగం - ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, గౌరవాన్ని కల్పించిన మహత్తర గ్రంధం. ఇందులోని ప్రాముఖ్యమైన అంశాలు - ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 15 (వివక్షకు వ్యతిరేకంగా) ఆర్టికల్ 17 (అంటరానితనం నిర్మూలన), ఆర్టికల్ 21 (జీవించు హక్కు), ఇవన్నీ వ్యక్తిగత ఆత్మగౌరవానికి పునాదులు. ఈ రాజ్యాంగం దళితులు, బీసీలు, మైనారిటీలకు సామాజిక న్యాయం కోసం మార్గం చూపింది. ఆత్మగౌరవం తో జీవించేందుకు రాజ్యాంగమే అస్త్రం.
ఇతర రాష్ట్రాలు బీసీల చేతుల్లో... కానీ మన రాష్ట్రంలో
నేడు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీ నాయకులే ముఖ్యమంత్రులుగా పాలన చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం, మొదటి నుంచీ పెరియార్ చూపిన బాటలో నడుచుకుంటూ సామాజిక న్యాయం, సమత (ఈక్విటీ)కేంద్రంగా చేసుకుని పాలన సాగిస్తోంది. కొంతకాలం బ్రాహ్మణ వర్గాలు అధికారంలో ఉన్నప్పటికీ, వారు కూడా పెరియార్ చూపిన సమానత్వ మార్గాన్ని ఏనాడూ విడిచిపెట్టలేదు.
జయప్రకాశ్ నారాయణ గారు సామ్యవాద ఉద్యమం (సోషలిస్టు మూవ్ మెంట్) కు మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన భావజాలం సమాజంలో ఉన్న వర్గ అసమానతలను నిర్మూలించి, ప్రతి ఒక్కరికీ స్వాభిమానంతో జీవించే హక్కు కల్పించడంపై ఆధారపడి ఉంది.
టోటల్ రివల్యూషన్ (సంపూర్ణ విప్లవం) అనే భావన ద్వారా ఆయన రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా, సాంస్కృతిక రంగాల్లో మార్పు కోరారు. ఇది కేవలం ప్రభుత్వ మార్పు కాదు, వ్యక్తి ఆత్మగౌరవాన్ని కాపాడే ఆత్మచైతన్య ఉద్యమం.
ఆయన ఉద్యమం సామాన్యుడికి గౌరవం, స్వాతంత్ర్యం, సమానత్వం అనే విలువలపై నిలిచి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో సాగింది. జేపీ ఉద్యమం, స్వయం గౌరవం కోసం సాగిన నిశ్శబ్ద విప్లవమే.
డా.రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ వంటి సోషలిస్టు మహనీయుల ఆత్మగౌరవ భావజాలం ఆధారంగా జరిగిన ఉద్యమాల వలన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో బీసీ వర్గాలు అధికారంలోకి వచ్చాయి. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, ములాయం సింగ్ యాదవ్ వంటి నాయకులు ఈ ఉద్యమపంథాలో ఎదిగినవారే. ఇవాళ జాతీయ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల బీసీ నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు.
కానీ దురదృష్టం ఏమిటంటే గత 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బీసీ వ్యక్తి కూడా ముఖ్యమంత్రిగా కాలేకపోయారు. ఇది బహుజనులపై రాజకీయ అణచివేతకు నిదర్శనం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 90% మంది బహుజనులు ఉండగా, కేవలం 10% ఉన్న దోపిడీ ఆధిపత్య కులాలు సామాజిక, ఆర్ధిక, రాజకీయ అన్ని రంగాల్లో ఆధిపత్యము చాటుతున్నాయి. దోపిడీ చేస్తున్నాయి.
బీసీల ఆత్మగౌరవం కోసం - రాజకీయ రాజ్యాధికారమే మార్గం
బీసీల దుస్థితి - ఓటు హక్కు ఉంది కాని అధికారంలో హక్కు లేదు. ప్రజాస్వామ్యంలో బీసీల పాత్ర ఓటర్ల స్థాయికి పరిమితం. పాలనలో పాత్ర శూన్యం. పార్టీలు ప్రతి ఎన్నికలలొ బీసీలను ఓట్ల కొరకు వినయము చూయించి, గెలిచిన తర్వాత మరిచిపోతున్నాయి. రాజ్యాధికారంలో బీసీ మేధావులకు స్థానం లేదు. ముఖ్యమంత్రి పదవి కలగా మిగిలింది.
తెలంగాణ బీసీలు స్వాభిమానం ఉన్నవారే. ఉద్యమాల్లో ముందుండి పాల్గొని ప్రాణాలు అర్పించిన వారే. నక్సలైట్ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచింది ఈ భూభాగంలో ఉన్న బహుజన సముదాయమే. దేశవ్యాప్తంగా ఏదైనా ఎన్కౌంటర్ జరిగినా, వీరమరణం పొందినవారు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల బీసీలే కావడం దురదృష్టకరం.
ఇలాంటి నేపథ్యంలో, నేడు దేశం నలుమూలలలో పని చేస్తున్న బీసీ విద్యార్థులు, యువత, బీసీ తేజస్సు ఉన్న మహిళ, సామాన్య రైతు, కార్మికుడు, ఉద్యోగులు - అందరూ ఆత్మగౌరవ నినాదంతో ఒక్కటవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణలో ఓ సామెత ఉంది – “ఇజ్జత్ సే జీనా, ఇజ్జత్ సే మర్నా”, అంటే గౌరవంతో జీవించడం, ఆత్మ గౌరవంతో మరణించడం. ఇంతగా గౌరవాన్ని నమ్మే బీసీలు, ఎందుకు ఇంకా ఆధిపత్య కులాల పాలనలో బానిసలుగా బతుకుతున్నారు. ఇది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం మరియు సమయం. తక్షణమే బానిసత్వపు మనస్తత్వాన్ని విడనాడాలి
అగ్రకులాల నేతల కిందే బీసీలు ఉద్యమం చేస్తారు, వారికి స్వంతత్ర భావాలు లేవు అనే అపార్థాల నుండి బయటపడాలి. మన కొరకు మనం ఉద్యమించాలన్న మనస్తత్వాన్ని పెంచుకోవాలి.
సర్వాయి పాపన్న, పండుగ సాయన్న ముదిరాజు, కొమరం భీం, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ, శివశంకర్, ప్రొ॥జయశంకర్, మారోజు వీరన్న వంటి వీరులు, మహానుభావులు చూపిన బాటలో నడిచి, బీసీ హక్కుల కోసం రాజకీయ స్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు బీసీ ఆత్మగౌరవ ఉద్యమం అవసరం ఎందుకంటే, ఈ దేశంలో బహుజనులు అన్నిరకాల ఉద్యమాలు చేశారు. రక్తం అర్పించారు, ప్రాణాలు త్యాగం చేశారు. కానీ పాలన మాత్రం ఇతరుల చేతిలో. ఉద్యమంలో బీసీలు ముందుండగా అధికారం మాత్రం దోపిడీ అగ్ర కులాల చేతుల్లో ఉండడం. ఇది తార్కికంగా, నైతికంగా, ప్రజాస్వామ్యంగా కూడా సహించరాని విషయం.
ఇప్పుడు కాలం మారింది. బీసీలు తమ సమస్యల్ని తామే స్వయంగా చర్చించాలి. తమ నాయకత్వాన్ని తామే స్వయంగా నిర్మించుకోవాలి. మన సొంత గొంతుతో, స్వయం చైతన్యంతో పోరాటంలోకి దిగాలి.
ఇక ఊరుకోరాదు. ఇక ఓట్లతో మార్చాలి. ఈరోజు బహుజనులు 90% జనాభా అయినా అధికారంలో 10% ప్రాతినిధ్యం కూడా లేదు. ఓట్లు మనవి, సీట్లు వారివా?
ఈ వాస్తవాన్ని చూసి మౌనంగా ఉండడం అంటే మనం ఇంకా దాస్య మనస్తత్వంతో ఉన్నట్లు అంగీకరించడమే. ఈ సమాజాన్ని మార్చాలంటే మొదట బీసీ లు మారాలి. మనము ఓటును అమ్ముకోకూడదు. దోపిడీ ఆధిపత్యకులాలకు ఇంకెప్పటికీ తలవంచకూడదు. బీసీలు ఒకటిగా సమైక్యంగా నిలిచి “బీసీ రాజ్యము, బీసీల చేతుల్లోనే ఉండాలి” అనే నినాదంతో ఉద్యమించాలి.
ఇది కులవాదం కాదు - ఇది హక్కుల పోరాటం
ఇది విద్వేషం కాదు - ఆత్మగౌరవం కొరకు చేసే ధర్మబద్ధమైన పోరాటం.
ఇది మన సమయం -రాబోయేది మన కాలం - మనం గౌరవంగా బ్రతకడానికి మనకున్న గొప్ప అవకాశం.
రండి.. కదిలి రండి.. ఆత్మగౌరవంతో మన చరిత్రను మనమే నిర్మించుకుందాం.
ఒక సమ సమాజాన్ని, నవ సమాజాన్ని నిర్మిద్దాం. మహనీయులు కన్న కలలు నిజం చేద్దాం - జై పూలే
బిసి ఇంటలెక్చువల్స్ ఫోరమ్, తెలంగాణ
Comments
Post a Comment