ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ఎడిటోరియల్ పేజీలో చిరంజీవులు సార్ వ్యాసం
జన గణన లో కుల గణన పై కొన్ని దుష్ప్రచారాలు మరియు వాస్తవాలు
టి. చిరంజీవులు
కన్వీనర్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ హైదరాబాద్
జన గణనలొ కులగణన అనే విషయం నేడు దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారింది .మెజార్టీ రాజకీయ పార్టీలు ఈ దేశంలో కుల గణన జరగాలని కోరుకుంటున్నాయి .కుల గణన ద్వారా గత 77 ఏండ్ల స్వతంత్ర భారతావని లొ ఎవరు లబ్ధి పొందారు, బడుగు బల హీన వర్గాల బతుకులు ఎంతవరకు బాగు పడ్డాయి అనే విషయం తేట తెల్లమయి , తగు ప్రణాళికలు రచించి,వేల సంవత్సరాలుగా సామాజికంగా,విద్యాపరంగా,ఆర్థికంగా, రాజకీయంగా అణగత్రొక్క బడిన బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందిచడం సాధ్యమని ఓబీసీ సంఘాలు ,కుల గణన మద్దతు రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నారు . ఈ దేశ పాలన లో మెజారిటీ ప్రజల భాగస్వామ్యం లేనిదే ఇది ప్రజా స్వామ్య దేశం అనిపించు కోదు .
కాని కొందరు కుల గణన వ్యతిరేకులు అనేక కుట్రలు , కుతంత్రాలు పన్ని కుల గణన కు వ్యతిరేకము గ అనేక దుష్ప్రచారాలు కొన సాగిస్తు కుల గణనకు అడ్డు పడాలని చూస్తున్నారు.ఒక కుక్కను చంపాలంటే ఆ కుక్కను పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి,అప్పుడు అందరు సహకరిస్తారు ,తల ఒక రాయి విసురుతారు.ఈ సామెతను నమ్మి కొందరు ఒక క్రమ పద్దతి ప్రకారము దుష్ప్రచారాన్ని కోన సాగిస్తున్నారు.ఆ దుష్ప్రచారాలను ఖండిస్తు బీసీ ఇంటెలెక్చ్యువల్ ఫోరమ్ సవివరము గా శాస్త్రీయము గా వివరణలు ఈ క్రింది విధము గా ఇవ్వడమైనది.
1. ప్రచారము: కులగణన కష్టమైనది, పరి పాలన దృష్ట్యా సాధ్యము కాదు( కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ 841/2021 మహారాష్ట్ర vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు Supreme court లో)
వాస్తవము: కుల గణన కష్టమైనది కాదు ,క్లిష్టమైనది అంతకంటే ఏమి కాదు. ఎలాంటి సమాచార సాంకేతిక పరిజ్ఞానం,కమ్యూనికేషన్స్, రవాణా సౌకర్యములు లేని కాలంలో నిరుపేద, నిరక్షర, బానిస భారత దేశంలో బ్రిటిష్ వారు, మన రాష్ట్రంలో నిజాం వారు ,1881 నుంచి 1931 వరకు అన్ని కులాల గణన ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి నిర్వ హించే జనాభా లెక్కలలో సేకరించారు. ఇంత సాంకేతికముగా ,కృత్రిమ మేధ అభివృద్ధి చెందిన ఈ కాలంలో కష్టమైనదా? కావున ఈ వాదన సరైనది కాదు. ఇప్పటికే సెన్సస్ లో ఎస్సీ మరియు ఎస్టీ ల కులం వివరాలు సేకరిస్తున్నారు అందులో ఓబీసీ కేటగిరీ కాలమ్ చేర్చితే సరిపోతుంది. అదేవిధంగా సరి ఐన శిక్షణ ఇచ్చి,తగు ఫార్మాట్ లు అభివృద్ధి చేస్తే ఈ దేశము లోని సుమారు 6000 ఓబీసీ కులాల లెక్కలు సేకరించడము సాధ్యం కానీ విషయ మేమి కాదు. ఇది దేశ ప్రగతికి,పునర్నిర్మాణానికి ఎంతగానో తోడ్పడే అంశం.
2 ప్రచారం- హిందూ సమాజాన్ని విభజిస్తుంది మరియు కులతత్వం పెంచుతుంది.
వాస్తవము:ఇకపోతే హిందూ సమాజమును విభజిస్తుంది అనేది వాస్తవం కాదు. భారతీయ సమాజము ముఖ్యంగా హిందూ సమాజము,గత మూడు వేల సంవత్సరాలుగా కులాల పేరుతో, వర్ణాల పేరుతో విభజించబడి ఉన్నది. కొత్తగా విభజింపబడేది ఏమీ లేదు. ఈ వర్ణములు,కులాలు అగ్రవర్ణాల సౌలభ్యం, ఆదిపత్యం కొరకు సృష్టింపబడినవే. శూద్రులను, అతిశూద్రులను అణిచివేయడానికి ఏర్పాటు చేయబడినవే ,కావున ఈ వాదనలో పస లేదు. ఈ దేశము లోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని కోరుకొని వారే ఇలాంటి వాదనలను తెరపైకి తెస్తారు.ఇక పోతే కులతత్వం పెరగటానికి కారకులు అగ్రవర్ణాలు, అందులోని రాజకీయ నాయకులు కాదా? తమ స్వార్థం కోసం ,ఆధిపత్యం కోసం కుల సంఘాలను ప్రోత్సహించి కుల తత్త్వాని పెంచి పోషించడము leda? ఇక కొత్తగా పెరిగేది ఏమిటి?
3. ప్రచారము: ఓబీసీల కులగణను ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి, ఓబీసీలు ఒక రాష్ట్రంలో బీసీలు ,మరొక రాష్ట్రంలో ఎస్సీలు లేదా ఎస్టీలు కావున ఈ సంక్లిష్టతపై అధ్యయనం చేయాలి.
వాస్తవము-జనగణన (సెన్సెస్)లో 1234 ఎస్.సి. మరియు 698 ఎస్.టి. కులాల లెక్కలు సేకరిస్తారు. మన రాష్ట్రంలో లంబాడాలు ఎస్.టి. లు,పక్కన మహారాష్ట్రలో ఒ.బి.సి.లు. మన రాష్ట్రంలో రజకులు ఒ.బి.సి.లు ,బీహార్ లో ఎస్.సి.లు, మహేంద్ర (మేదరి) కులం తెలంగాణలో బిసిలు ,ప్రక్కన కర్ణాటకలో ఎస్.టి.లు. అలాంటప్పుడు ఎస్.సి, ఎస్.టి ల లెక్కలు సేకరించడం లేదా ?కులం అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా రిజర్వేషన్ కేటగిరి కింద వర్గీకరించబడి ఉంది .కేవలం ఒ.బి.సి.ల లెక్కలు సేకరించమంటే ఈ అసంబద్ద వాదనల?
4. ప్రచారము: ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి ,వాటిని కూడా లెక్కించాలా?
వాస్తవము: ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇలా ఏ మతంలోనైనా కులాలు ఉంటే వాటిని కూడా లెక్కించాలి. ఇప్పటికే చాలా ముస్లిం కులాలు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఒ.బి.సి.లలో ఉన్నారు. ఉదాహరణకు మన రాష్ట్రంలో బి.సి. ఎ లో మెహతర్, బి.సి. బిలో దూదేకుల, లద్దాపి, పింజారి లేదా నూర్ భాషా, బి.సి. ఈలో 14 ముస్లిం కులాలు ఉన్నాయి. అలాగే ఎస్.సి ల నుండి క్రైస్తవ మతంలోకి మారిన వారికి బి.సి.'సి' క్యాటగిరి ఉంది కావున ఏ మతంలో కులాలు ఉన్నా గణన చేయాల్సిందే.
5. ప్రచారము --కుల గణన వలన రిజర్వేషన్ల డిమాండ్ పెరుగుతుంది.
వాస్తవము: ఈ దేశంలో ఎస్.సి. లకు, ఎస్.టి. లకు వారి జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగాలు, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి. అగ్రకులాలు 15% ఉండగ అందులో 5% లేని అగ్రకుల పేదలకు ఇ.డబ్ల్యూ.ఎస్ పేరిట 10% విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ దేశ మూల వాసులైన ఒ.బి.సి.లు 60% ఉంటే వారికి 27% కేవలం విద్య, ఉద్యోగాలలో ఇచ్చారు. అది కూడా ఇప్పటివరకు పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదు. చట్టసభలలో ఎలాంటి రిజర్వేషన్లు లేవు. స్థానిక సంస్థలలో 50% సీలింగ్ కు లోబడి ఎస్.సి, ఎస్.టి లకు జనాభా దామాషా ప్రకారం ఇచ్చి మిగిలితే బిసిలకు ఇవ్వాలి.
దేశవ్యాప్తంగా 15% జనాభాలేని అగ్రవర్ణాలు కేంద్రంలోని విద్య, ఉద్యోగాలలో 50% పైబడి, చట్టసభలలో 60% పైబడి ఉంటారు. 60%నికి పైబడి జనాభా ఉన్న ఒ.బి.సి లు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగంలో 22%నకు లోపే పరిమితమై ఉంటారు.అలాగే ఈనాటికి కేంద్ర ప్రభుత్వంలో, ప్రభుత్వ ఉద్యోగాలలో చేరని వందల ఓబిసి కులాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో నామ మాత్రము.ఆర్థిక వ్యవస్థలో పై ఒక శాతం ధనవంతుల వద్ద 40.5 % సంపద ఉంటే ,క్రింది 50 % వద్ద 6.4 % ఉంటుది (World inequality lab report 2024) ఈ దేశము లోని బిలియనీర్స్ ల లో 88% అగ్రవర్ణాల వాళ్లే .ఇది ఈ దేశంలోని సామాజిక న్యాయం. రాజ్యాంగ పీఠికలోని సామాజిక న్యాయం కేవలం మిధ్యగా మారిన వైనం ,అందని ద్రాక్ష పండు .అందుకే ఒ.బి.సిలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ న్యాయ మైన కోరిక కదా? కొన్ని ఆధిపత్య కులాలు తమని ఒ.బి.సిలలో చేర్చాల నే డిమాండ్ ను ఈ కులగణన వలన సమర్థ వంతము గ అడ్డుకో వచ్చును.
6. ప్రచారం: రిజర్వేషన్ల వలన మెరిట్ కు అన్యాయము.
వాస్తవము: మెరిట్ అనేది సాపేక్షిక అంశం. అనాదిగా అగ్రవర్ణాలు వర్ణ వ్యవస్థలో రిజర్వేషన్లు అనుభవించలేదా? బ్రాహ్మణులు పౌరోహిత్యం, వేద ,పురాణాలు పటించడం, గురువుల పాత్ర పోషించ లేదా! క్షత్రియులు రాజరికం, వైశ్యులు వ్యాపారం చేయగా,శూద్రులు కేవలం వారికి సేవ చేసే వర్గాలుగా మిగిలి పోలేదా. విద్యలు నేర్చిన శూద్రులకు ఎలాంటి గతి పట్టించారో పురాణాలలో ఏకలవ్యుడు, శంభూకుని కథలు మనకు కనిపించవా! ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలలలో తల్లిదండ్రుల ప్రోత్బలంతో చదివిన వారికి , అర కొర వసతులు గల ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి మధ్య పోటీ ఎంతవరకు సమంజసము?
భారతదేశంలో గత 77 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు అమలు కాబడుతున్నాయి. మరి మన దేశం అభివృద్ధి పథంలో పయనించడం లేదా? రిజర్వేషన్లు శాస్త్ర ,న్యాయ రంగాలలో ఎక్కడున్నవి? ప్రైవేటు రంగంలో ఎక్కడ ఉన్నవి. కేవలం కొన్ని విద్యా, ప్రభుత్వ ఉద్యోగ ,రాజకీయ రంగాలలో కల్పిస్తేనే ప్రతిభ (మెరిట్) దెబ్బతింటుందా. తమిళనాడులో విద్య ఉద్యోగాలలో ఒ.బి.సి లకు 50 % రిజర్వేషన్లు ఉన్నాయి. మరి అక్కడ ప్రభుత్వ కార్య నిర్వాహక వ్యవస్థ కుప్పకూలిందా? తమిళనాడు మిగతా రాష్ట్రాల కంటే అన్ని రంగాలలో ముందు లేదా? మండల్ రికమండేషన్స్ 1990 లో ఉద్యోగాలలో అమలు పర్చాలన్నప్పుడు ఇదే వాదన, ఇప్పుడు దేశము పురోగతి లో దూసుకు పోవటం లేదా 4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థ కాలేదా ?ఎవరి జనాభా ప్రకారం వారికి వాటా పంచాల్సిందే. రాజ్యాంగ సవరణ చేసి ,సుప్రీంకోర్టు విధించిన 50 శాతం సీలింగ్ ను తొలగించాల్సిందే. క్రీమీ లేయర్ ను తీసివేయాల్సిందే. ఒ.బి.సి ల సబ్ క్యాటగారైజేషన్ చేయాల్సిందే.
ఈ దేశంలో కుల వ్యవస్థ రూపుమాపాలంటే ,హిందువులందరూ ఏకం కావాలంటే ,అనాదిగా అనగా దొక్కబడిన ఒ.బి.సి (శూద్ర) వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి వారిని ఉన్నత వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందేలాగా అవకాశాలు కల్పించినప్పుడే అది సాధ్యమవుతుంది. కులరహిత సమాజం ఏర్పాటు సుగమవుతుంది .రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయం అందరికీ అందుతుంది.రాజ్యాంగ నిర్మాతల కలలు నెరవేరుతాయి.
7. ఏక్ హైతో సేఫ్ హై, బాటింగే తో కాటింగే:
వాస్తవం-ఒక్కటిగా ఉంటే భద్రత ,అంటే అది అగ్రవర్ణాల దోపిడీకి భద్రతనా? కేవలం మా వాటా మాకు కావాలంటే అగ్ర వర్ణాల తమ ఆదిపత్యానికి అభద్రతగ భావిస్తే ఎలా? పంచితే దెబ్బతింటాం. ఎవరు దెబ్బతినేది,అగ్ర వర్ణాల?
ఇంకెన్నాళ్లు ఈ అసమానతలు,కుల వివక్షత,దోపిడీ.వేల సంవత్సరాల గా వివక్షతకు గురి చేస్తున్నారుగా ఇంకా సరిపోలేదా ?ఎవరి వాటా వారికి పంచిన అందరికీ లాభదాయకమే ఈ దేశ పునర్నిర్మానికి ,సమసమాజ స్థాపనకు ఎంతగానో తోడ్పడుతుంది. హిందువుల ఐక్యతకు తోడ్పడుతుంది.
8.హిందూ మతానికి ప్రమాదం-
వాస్తవం-చరిత్రలో కులవివక్షతలు లేని కాలంలో ప్రజలు ఐకమత్యంగా ఉన్నారు. ఈ దేశం క్షేమంగా ఉంది .ఎప్పుడైతే కుల వ్యవస్థ విజృంభించిందో అప్పుడే ఈ దేశం విదేశీయుల చేతుల్లోకి వెళ్లి పోయింది. 650 సంవత్సరాల కాలం మహమ్మదీయుల పరిపాలనలో ,190 సంవత్సరాల ఇంగ్లీష్ వారి పరిపాలనలో మగ్గింది .ఇన్ని సంవత్సరాలు నిరంకుశ,రాచరిక ,విదేశీ మతాల పాలనలో మగ్గిన ,ఎన్ని హింసలు ,అత్యాచారాలకు గురైన హిందూమతాన్ని ఎవరు ఏమి చేయ లేక పోయారు .కొందరుగతము లొ మతము మారి దేశ విభజనకు కారణము అయి ఉండవచ్చును .కానీ ఈ ప్రజాస్వామ్య దేశము లొ,ఈ మెజారిటీ ప్రజల పాలనలో హిందూమతం కు విదేశీ మతాల నుంచి తీవ్ర ముప్పు ఉన్నది అన్న వాదన కూడా సరైనది కాదు .క్రింది వర్గాల హిందువులకు తగు అవకాశాలు కల్పించకుండా అణగదొక్కదానికి,అగ్రవర్ణాల ,ఫ్యూడల్ రాజకీయ నాయకుల కుట్ర ఇది . మొదలు అవకాశాలు కల్పిస్తే వారు కూడా మీ తో సమ ఉజ్జి లుగా కలసి వస్తారు.
9. :కులం అనేది విదేశీయుల కుట్ర. కులం అనేది భారతదేశంలో విదేశీయులు ప్రవేశపెట్టిన భావన :
వాస్తవము:
ఇది కూడా శుద్ధ అబద్ధం .ఋగ్వేద కాలం నుండి ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఉంది .ఋగ్వేదంలోని పురుష సూక్తం లో ప్రజాపతి శిరస్సు నుంచి బ్రాహ్మణులు ,బాహువుల నుంచి క్షత్రియులు ,ఊరువుల నుంచి వైశ్యులు ,పాదాల నుంచి శూద్రులు జన్మించినట్లు శ్లోకం లేదా .భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాతుర్వర్ణం మయ స్పషము గుణకర్మ విభాగశ:అనలేదా ?మనుస్మ్రతి లో శూద్రులను ఏ విధంగా అణగ త్రొక్క వలెనో వివరించబడలేదా..?
ఈ దేశంలో గత వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ వర్ణ వ్యవస్థకు వృత్తులు తోడై కుల వ్యవస్థ ఏర్పడి ఉండవచ్చును .క్యాస్ట్ అనే పదము పోర్చుగీసు పదం కావొచ్చు ,కానీ ఇది ఉత్తర భారత దేశంలోని జాతి పదానికి సమానంగా వాడటం జరిగింది తెలుగులో ఇదే కులం గా పిలవబడింది .ఈ దేశం పరాధీనంలో బతకడానికి ,శూద్రులను అతి శూద్రులను క్రూరంగా అణచివేయడానికి ,ఈ వర్ణ వ్యవస్థ ,కుల వ్యవస్థ, మనస్మృతులు కారణం కాదా?.. ఈ నాటికి కులమే గద అన్ని రంగాలను ప్రభావితం చేసే అంశం ముఖ్యంగా రాజకీయ,ఆర్థిక అంశాలను.
10.కుల గణన డిమాండు విదేశీ శక్తుల కుట్ర
వాస్తవము:
-భారతదేశం ప్రగతిని చూసి ఓర్వలేక విదేశీ శక్తులు ఈ దేశ సంస్కృతిని ,సమైక్యతను ,సమగ్రతను దెబ్బతీయడానికి పన్నిన పన్నాగం అనేది ఒక శుద్ధ అబద్ధం .ఒక దుష్ప్రచారం .ఇదే నిజమైతే బిజెపి 2010 పార్లమెంటులో 2011 సెన్సెస్ లో కులగణన చేయాలని డిమాండ్ చేసి పార్లమెంటులో తీర్మానం ఆమోదానికి అనుకూలంగా ఓటు వేయలేదా.? ఆగస్టు 31, 2018 న పార్లమెంటులో ఆనాటి హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు 2021 సెన్సెస్ లో కులగణన చేస్తామని ప్రకటించ లేదా ?వారు విదేశీ శక్తుల ప్రభావానికి లోనై ఈ ప్రకటన చేశారా? ఇది కేవలం కుల గణన చేయకుండా ఎగ్గొట్టడానికి చేస్తున్న దుష్ప్రచారం . ప్రతి రాజకీయ పార్టీ అధికారం లేనప్పుడు కుల గణన చేస్తామని,,అధికారం లోకి రాగానే కుంటి సాకులు చెప్పి ఎగ్గొటుతున్నారు.
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుకున్నదే తడవుగా ఏకీకృత పన్ను వ్యవస్థ (G.S.T.),
పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, అడగకుండానే అగ్రవర్ణాలకు 10% E.W.S. రిజర్వేషన్లు, మహిళలకు 33% రిజర్వేషన్లు , జమిలి ఎన్నికల బిల్లు తీసుకురావడం లేదా కానీ వారికి కులగణన చేయడానికి మనస్సు లేక రకరకాల సాకులు చెబుతున్నారు .ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి కులగణన వలన దేశానికి వష్టం ఏమీ లేదు ,అగ్రవర్ణాల ఆధిపత్యానికి తెరపడటం తప్ప .60 శాతం జనాభా ఉన్న ఓబీసీ ప్రజలు ఈ దేశ పాలన వ్యవస్థలో భాగస్వామ్యం లేకుండా ఆ దేశం ఎలా ప్రజాస్వామ్య దేశం అవుతుంది ?రాజ్యాంగ ఆశయాలు ఎలా నెరవేరుతాయి ?అందుకే ఓ బి సి ,ఎస్ .సి .,ఎస్ .టి .బహు జనులు ఏకమై సమగ్ర కులగణనకు నినదించాలి ,
ఉద్యమాలు చేయాలి, ,సాధించు కోవాలి అప్పుడే ఈ భారతావని వికసిత దేశం గా మారుతుంది.
Comments
Post a Comment