తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు వివాదాల మధ్యనే జరిగితే రెండవ పర్యాయం జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వివాదాస్పదంగానే మారుతున్నాయి. రెండుసార్లు వివాదాలకు కారణం బీసీ రిజర్వేషన్లే కావడం గమనారహం. చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోయినా ప్రభుత్వం మాత్రం బీసీలకి జీవో నెంబర్.9 ద్వారా 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ అక్టోబర్ 9 నుండి స్థానిక ఎన్నికలకి సిద్ధపడటంతో కోర్టు కేసుల నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో పెద్ద చర్చినే జరుగుతుంది. 12,760 గ్రామపంచాయతీలకి 5763 ఎంపీటీసీ లకి 565 జడ్పిటిసి లకి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం పట్టుదలగా ముందుకెళుతున్నప్పటికీ బీసీల రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కి రాకుండా ప్రభుత్వం ఎలా ఎన్నికలను నిర్వహించగలుగుతుందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కూడా స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకపోవడం వలన ఎన్నికలు నిర్వహించలేకపోయాయనే విషయాన్ని గమనించాలి.
ఎన్నికలకి అడ్డంకులు ఏమిటి?
2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తూ తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలలో బీసీలకి 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం బిల్లుని రూపొందించి శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించి రాష్ట్రపతికి పంపారు కానీ ఆ బిల్లుపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదని నిర్దేశిస్తున్న 285 (ఏ) సెక్షన్ ని సవరణ చేస్తూ శాసనసభలో ఆమోదించిన సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లోనే ఉన్న నేపథ్యంలో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్.9తో ప్రత్యేక జీవోని విడుదల చేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో రిజర్వేషన్లు పరిమితి 50 శాతం దాటటంతో రెడ్డి జాగృతి సంస్థకు చెందిన బి. మాధవరెడ్డి అభ్యంతరాలను తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేయటంతో ఆ పిటీషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం పూర్తిస్థాయి విచారణ అక్టోబర్ 8 కి వాయిదా వేయటం జరిగింది.
తెలంగాణ హైకోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 9 నుండి రెండు దశలలో జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను, మూడు దశలలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రకటించింది కాబట్టి జీవో ప్రకారంగా ఎన్నికలు జరుగుతాయా కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
12 అంశాలతో ఉన్న జీవోలో 243 (డి) (టి) ప్రకారంగా రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నదని ప్రస్తావించారు కానీ 1994 చట్టం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు కల్పించడానికి అధికారం ఉన్నా నిబంధనలకు లోబడి మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలి అలాగే డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకే రిజర్వేషన్లు పెంచుతున్నామని జీవోలో ప్రస్తావించారు కానీ డెడికేటెడ్ కమిషన్ ని ప్రస్తావించటం అంటే 2010 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా రిజర్వేషన్ల కల్పనకి ట్రిపుల్ టెస్ట్ ని అనుసరించామని చెప్పటమే కానీ జీవోలో చట్ట ఉల్లంఘన, సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి లేకపోవడం, 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్ట సవరణ జరగకపోవడంతో జీవో ప్రకారంగా ఎన్నికలు జరపటానికి న్యాయస్థానాలు అంగీకరించకపోవచ్చు. రిజర్వేషన్ల కల్పనకు గాని పెంపునకి గాని చట్టపరిధిలో ఉండాలి న్యాయస్థానాల తీర్పులకు లోబడి ఉండాలి అప్పుడే రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవో ని కోర్టులు తప్పు పట్టినా, స్టే ఇచ్చినా ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. 2019 రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితిలే ఏర్పడతాయి.
రిజర్వేషన్లకి అడ్డుపడకండి
అవకాశాలు దక్కని కులాలకి వర్గాలకి అవకాశాలు దక్కటానికే రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి. ఎస్సీ ఎస్టీ లకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించిన విధంగానే వెనుకబడిన వర్గాలకి (బీసీ) కూడా చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని దశాబ్దాల డిమాండ్ కానీ బీసీలకి చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ కార్యరూపం దాల్చకుండా డిమాండ్ గానే మిగిలిపోయింది. 1994లో 243 ఆర్టికల్ ద్వారా స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు నాటి నుండి 2013 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు అయినాయి కానీ 2010 సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుండి 23 శాతానికి తగ్గిపోయిన్నాయి. చట్టసభలలో రిజర్వేషన్లు లేకపోవటం వలన 56 శాతం ఉన్న బీసీలకి శాసనసభలో 21 మంది శాసనసభ్యులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు నాలుగు శాతం ఉన్న ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వారు 43 మంది శాసనసభ్యులుగా ఉన్నారంటే రిజర్వేషన్ల ఆవశ్యకతను అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 134 బీసీ కులాలు ఉంటే ఇప్పటివరకు 80 కులాలకి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా అవకాశమే దక్కలేదు. 56 శాతం ఉన్న బీసీలకి 42 శాతం రిజర్వేషన్లు దక్కటం సహజ న్యాయంగానే భావించాలి. చట్టాలు ఎలా ఉన్నా సామాజిక న్యాయంపై గౌరవం ఉన్న వ్యక్తులు, వర్గాలు, బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడకుండా ఉంటే మంచిది. 69 సంవత్సరాలు తెలుగు నెల పై అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న వర్గాలు కనీసం బీసీలకి అధికారంలో సముచితమైన వాటా ఇవ్వటానికి అడ్డుపడకుండా ఉంటే అది సామాజిక ఐక్యతను మరింత బలపరుస్తుంది.
కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది?
42 శాతం రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది రాష్ట్రంలో ఆసక్తి రేపుతున్న అంశం. కోర్టుల తీర్పు, విచారణ అనేది చట్టాలకి, గత తీర్పులకు లోబడే ఉంటుందనే విషయాన్ని గమనించాలి. 1992 సుప్రీంకోర్టు తీర్పు, 1994 స్థానిక సంస్థల రిజర్వేషన్ల మార్గదర్శకాలు, నిబంధనలు, 2010 సుప్రీంకోర్టు ఇచ్చిన ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలనే సూచనలు, 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో కల్పించిన రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో.9 లో ప్రతిపాదించిన రిజర్వేషన్ల ప్రకారంగా ఎన్నికలు నిర్వహించటం దాదాపు సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు బలహీనంగా ఉండటం, 285 (ఏ) సెక్షన్ కి సవరణ జరగకపోవడం కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వానికి రిజర్వేషన్లు సాధనలో ప్రతిబంధకంగా మారవచ్చు. తమిళనాడు అనుభవాలు పరిగణలోకి తీసుకున్నా పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చట్ట రూపంలో రిజర్వేషన్లు సాధించాల్సి ఉంటుంది. 42 శాతం రిజర్వేషన్లు సాధించగలిగితే వార్డు పదవులతో పాటు 55,280 స్థానిక సంస్థల పదవులు బీసీలకు దక్కుతాయి అలా కాకుండా రిజర్వేషన్లకు అవరోధాలు ఎదురైతే 73 శాతం (23+ 50) తో 96,083 స్థానాలలో పోటీ చేసి బలహీనవర్గాలు రాజకీయంగా తమ సత్తా ఏమిటో పార్టీలకి ప్రభుత్వాలకు చూపించాల్సిన అవసరం ఉందని బీసీ వర్గాల చైతన్యం క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది.
డాక్టర్ తిరునహరి శేషు
9885465877
Comments
Post a Comment