తాత్కాలిక జీవోలతో బిసిలు మోసపోవద్దు
ఏమి ఎప్పుడో చెప్పిన బీసీ ఇంటెలెక్చ్యువల్ ఫోరమ్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ టీ చిరంజీవులు
42% బిసి రిజర్వేషన్స్ అంశంలో ఎన్నో చిక్కుముడులు మరెన్నో తికమకలు, అగ్ర, కులాలు, ఆధిపత్య కులాలు సృష్టించే ఆటు పొట్లను, అగ్రవర్ణ రాజకీయ పార్టీలు వేసే ఎత్తుగడలను, ఒడిదోడుకులను. ఎదుర్కొనే విధంగా ఈ వ్యాసాన్ని తీర్చి దిద్దిన రిటైర్డ్ ఐఏఎస్ బిసి ఇంటెలెక్చ్యువల్ ఫోరమ్ చైర్మన్ టీ చిరంజీవులు సార్ గారికి ధన్యవాదములు 🙏🙏ఈ వ్యాసాన్ని ప్రతి ఒక్కరు ఒకటికి రెండు సార్లు చదివి అర్ధం చేసుకోగలరు.. చెన్న శ్రీకాంత్ బిసి...
@@@@@@#######
స్థానికసంస్థలు ,విద్యా ,ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు-సాధ్య సాద్యాలు
టి. చిరంజీవులు IAS (రిటైర్డ్)
చైర్మన్, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం
“రిజర్వేషన్ అనేది పించను కాదు,అది ప్రాతినిధ్య హక్కు.”
— డా. బి.ఆర్. అంబేద్కర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ప్రతిపాదన – పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285Aను సవరించి, స్థానిక సంస్థల లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినన్స్ తీసుకు రావడం.ఇది ఒక వైపు రాజకీయంగా గర్వపడే ప్రకటనలా కనిపించవచ్చు. కానీ దీని వెనకున్న చరిత్ర, న్యాయపరమైన పరిమితులు, కోర్టు తీర్పులు, గత అనుభవాల్ని బీసీ ప్రజలు, ప్రజాస్వామిక వేత్తలు గమనించాల్సిన అవసరం ఉంది.
సెక్షన్ 285A చరిత్ర – ఒక తాత్కాలిక నిర్ణయం ఎలా శాశ్వత చట్టమయ్యింది?
2018లో తెరపైకి వచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285A అనే విభాగం అసలు లేనే లేదు.
ఆ సంవత్సరం ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం.396 ద్వారా బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించగా, హైకోర్టు విచారణ అనంతరం ఈ జీవోను రద్దు చేసింది , కారణం, మొత్తం రిజర్వేషన్లు 50% సీలింగ్ మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు (కృష్ణమూర్తి కేసు, 2010).
దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసినా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తర్వాత అప్పీల్ వెనక్కి తీసుకుంది. ఆ పరిస్థితుల్లో బీసీలకు 23%రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించేందుకు ఆర్డినెన్స్ 2/2018ను తీసుకొచ్చింది. కానీ ఆ ఆర్డినెన్సుకు 6 నెలల కాల పరిమితి మాత్రమే. కాబట్టి, ఆర్డినెన్సును శాశ్వతంగా చట్టంగా మార్చే ఉద్దేశంతో యాక్ట్ నం.4/2019 ద్వారా పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285A చేర్చారు.
ఇప్పడు ప్రభుత్వం మళ్లీ అదే సెక్షన్ను తొలగించి 42% బీసీ రిజర్వేషన్ జి ఓ ద్వారా అమలు పర్చాలన్నా నిర్ణయానికి వచ్చింది .అయితే ఇది సాంకేతికంగా సాధ్యమైనా, న్యాయపరంగా నిలవదు అన్నది గత అనుభవాలూ, న్యాయ పరిధిలోని నిపుణుల అభిప్రాయాలూ స్పష్టం చేస్తున్నాయి.
న్యాయ పరిమితి – 50% సీలింగ్
పంచాయతీరాజ్ ,మున్సిపల్ సంస్థలకు 73 ,74 సవరణ ద్వారా 1992లో రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 243 D మరియు 243 T చేర్చడం జరిగింది .మొదటిసారిగా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించబడినవి. ఎస్సీ ఎస్టీలకు ఆర్టికల్ 243 డి 1మరియు టీ 1 కింద జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించబడింది .కానీ బీసీలకు ఆర్టికల్ 243 d6 మరియు టీ 6ప్రకారం రాష్ట్రాలు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి వదిలి వేయడం జరిగింది .అందువలనసుప్రీమ్ కోర్ట్ 50% సీలింగ్ను 2010 లొ విధించడం జరిగింది.
సుప్రీంకోర్టు తీర్పులు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే, మొత్తం రిజర్వేషన్లు (SC, ST, BC కలిపి) 50% మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వగా 50% లో మిగలిన శాతాన్ని బీసీలకు ఇవ్వాలి ఇది భారత రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు కీలక భాగంగా భావించబడుతోంది.
తీర్పులు:
• కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2010)
• మహారాష్ట్రలో OBC రిజర్వేషన్ కేసు (2021 )(వికాస్ కిషన్ రావు గావాలి)
• ఆంధ్రప్రదేశ్/తెలంగాణలో పలు హైకోర్టు తీర్పులు
ఇవన్నీ అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి ,డెడికేటెడ్ కమిషన్ పెట్టాము, కులగణను చేసాము .బీసీల రాజకీయ వెనుకపాటు తనంపై ఎంపిరికల్ డాటా సేకరించాము, కాబట్టి రిజర్వేషన్లు పెంచితే న్యాయ స్థానాలు తప్పు పట్టవు ,తప్పకుండా అంగీకరిస్తాయని ,కాబట్టి జి ఓ ఇస్తే సరిపోతుంది అని కొందరు వాదిస్తున్నారు.ఈ విషయంలో మీకు బీహార్ అనుభవాన్ని గుర్తు చేయ దలచు కున్నాను.బీహార్లో నితీష్ కుమార్ గవర్నమెంట్ కూడా 2023లో కులగణన చేసి ఆ రిపోర్టు ను,కులాల వారిగా జనాభాను పబ్లిష్ చేసి రిజర్వేషన్లు 65శాతానికి పెంచింది .కానీ హైకోర్టు రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకొని 50 % సీలింగ్ దాటిందనే ఉద్దేశంతో ఆ జీవోను కొట్టివేయడం జరిగింది .కాబట్టి మళ్లీ మనం అదే ప్రయత్నం తిరిగి చేయడం ఒక వృధా ప్రయాస తప్ప ఇంకో విషయం కాదు
రాజకీయ ప్రయోజనం కోసం ఆర్డినెన్సుల /జి ఓ ల ఆట
ఇది తొలి సారి కాదు. ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆర్డినెన్సు /జి ఓ జారీ చేస్తోంది. తర్వాత అది కోర్టులో రద్దవుతోంది. ప్రజల్లో బీసీల హక్కుల కోసం కృషి చేస్తున్నట్టు చూపించేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. ఇది ఒక రకంగా ఓటు బ్యాంక్ రాజకీయాలకు నిదర్శనం.
“ప్రతిసారి కోర్టులో ఓడిన వ్యూహాన్ని మరోసారి ప్రయోగించడం ప్రజల్ని మోసం చేయడమే.”తప్ప ఇంకోటి కాదు.
42% జీవో – కోర్టు అడ్డుగోడ!
నిజంగా సెక్షన్ 285Aను సవరించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినా, అది కేవలం జీవో జారీకి సహాయపడే ఉపాయంగా ఉపయోగపడుతుంది. కానీ కోర్టుల న్యాయ సమీక్షలో ఇది మళ్లీ రద్దవే అవకాశాలు ఎక్కువ. చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుంది. 2018 లొ ఇదే కథ జరిగింది.
ఇందుకు చట్టపరమైన రక్షణ అవసరం. వాస్తవానికి బీసీలకు న్యాయంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే చట్టము చేసి భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి.ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు బీసీలకు 42 శాతం పెంచుతూ ఒక బిల్లును స్థానిక సంస్థల్లో 42% ఇంకో బిల్లును గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపడం జరిగింది .తక్షణం ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఈ బిల్లుల ను ఇప్పుడు 21 జూలై 25 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాలలో పాస్ అయ్యేలాగా కృషి చేయాలి.ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ఆ బిల్లును 9 వ షెడ్యూల్లో చేర్పిస్తే ఈ సమస్యకు శాశ్వతంగా ఒక పరిష్కారం లభిస్తుంది
నిజమైన పరిష్కారం – 9వ షెడ్యూల్
తమిళనాడు ప్రభుత్వ ఉదాహరణ ముందు ఉంది. 1994 లో విద్యా,ఉద్యోగ,స్థానిక సంస్థల లో అక్కడ 69% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి గత 31 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు.
తెలంగాణ కూడా అదే మార్గాన్ని అనుసరించాలి. పార్లమెంటులో చర్చించి, రాష్ట్రపతి ఆమోదం తో చట్టాన్ని చేసి 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం పంచాయతీరాజ్ చట్టానికే కాదు — అన్ని విద్యా ఉద్యోగాలకు కూడా వర్తించే శాశ్వత పరిష్కారం అవుతుంది.
9వ షెడ్యూల్లో పెట్టిన చట్టాలను కూడా న్యాయ సమీక్ష చేసే అధికారం మాకు ఉందని 2007లో సుప్రీంకోర్టు ఐ ఆర్ కోయెల్హో కేసు లో అభిప్రాయ పడింది .కేశవానంద భారతి కేసు అనగ 1973 నుంచి 9 వ షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టం అయినా అది రాజ్యాంగం మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే సమీక్షించే అధికారం తమకు గలదని వ్యాఖ్యానించింది.అదే విధంగా జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులొ (2022) EWS రిజర్వేషన్ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కావు అని అభిప్రాయపడ్డాయి. కావున 9 వ షెడ్యూల్లో చేర్చితే న్యాయ సమీక్ష చేసిన తప్పించుకోగలము .అదేవిధంగా తమిళనాడు 1994 నుంచి ఈరోజు వరకు కూడా రిజర్వేషన్లు బీసీలకు 50 శాతం కల్పిస్తుంది .అదే విధంగా 9 షెడ్యూల్లో ఇప్పటివరకు సుమారు 284 చట్టాలు చేర్చడం జరిగింది. ఏ ఒక్క చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు ఇప్పటివరకు రద్దు చేయ లేదు.కావున తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడమే మనకు రక్షణ అని చెప్పక తప్పదు
జీవో జారి చేసి తక్షణమే ఎలక్షన్ నోటిఫికేషన్ కు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది .ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లయితే న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవు అనేటువంటి వాదనను కూడా తెరపై తీసుకొచ్చారు .కానీ ఇది వాస్తవం కాదు .మహారాష్ట్రలో 2018 మరియు 2020 నోటిఫికేషన్స్ మరియు జరిగినటువంటి ఎన్నికల్ని 2021 లో సుప్రీంకోర్టు వికాస్ కిషన్ రావు గవాలి కేసులో ఐదు జిల్లాలలో కొట్టివేయడమే కాకుండా డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ లేదనే ఉద్దేశంతో బీసీలకు రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా మళ్లీ ఎన్నికలు నిర్వహించల్లన్నా ఆదేశాలు మన కల్ల ముందు ఉంది .కాబట్టి ఈ విషయములో కూడా వారి వాదన సరికాదు.
బీసీ ప్రజలకు హెచ్చరిక
ఈ నేపథ్యంలో బీసీ ప్రజలు మళ్లీ మోసపోకూడదు. తాత్కాలిక జీవోలు, ఆర్డినెన్సుల మీద ఆశలు పెట్టుకోవద్దు. రాజకీయాలకోసం బీసీల హక్కులను కాల రాచే ప్రయత్నాలను గమనించాలి. బీసీ హక్కులు, న్యాయబద్ధ రిజర్వేషన్ల కోసం ఊహలపై కాదు — రాజ్యాంగ పరిధిలో పోరాటం చేయాలి.
Comments
Post a Comment