ప్రాణులన్నీటిని దేవుడు సృష్టించాడని
ప్రకృతి నియమాలకు విరుద్ధంగా,
మా మత దేవుడే సృష్టికర్త అని మతాలన్నీ
వాదులాడుకుంటున్నాయి.ఎవరిది వాళ్లే గొప్పలు చెప్పుకుంటున్నారు..కానీ ఇంతవరకు ఏ దేవుడు సృష్టించాడో వాళ్లలో వాళ్లే తేల్చు కోలేకపోతున్నారు. ఇది వారి అజ్ఞానానికి,అసమర్థతకు పరాకాష్ట.
సైన్సు పరంగా చూస్తే సైన్సు తేల్చిందేమిటంటే
ఏ మత దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించలేదు. ఒకానొక సమయాన బిగ్ గ్యాంగ్
( మహా విస్పోటనం) జరిగి జడ పదార్థము నుండి ఈ విశ్వం పరిణామం చెందిందని తేల్చివేసింది. ఈ విశ్వం ఇంకా విస్తరిస్తూనే ఉందని ఈ విశ్వంలో ఉన్న నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలన్నీ మన భూమి కూడా వివిధ సమయాల్లో ఏర్పడ్డాయని చెప్తోంది.
ఒక మహా పురుషుడి
ముఖము నుండి
ఛాతీనుండి, తొడలనుండి,
పాదాల నుండి మనుషులు పుట్టారని
సహజమైన, ప్రకృతికి విరుద్ధంగా
దుష్ట భావనలకు తెరలేపింది ఎవరు?
మనుషులను
వర్ణాలుగా,
వర్గాలుగా,
కులాలుగా,
మతాలుగా విభజించి,
కొన్ని వర్గాలను బానిసలుగా చేసి
మనుషులను సమానత్వానికి
దూరం చేసింది ఎవరు?
సమాజంలో మూఢనమ్మకాలు, మత మూర్ఖత్వం,
దుష్ట సంప్రదాయాలు పెంచేవారు ఎవరు?
కొన్ని వర్గాల మనుషులను అంటరానివారిగా చూస్తూ పశువులను పక్షులను దేవతలుగా పూజించేది ఎవరు? మనుషులను నిరాకరించి హీనం గా చూసేదిఎవరు?
తామే జ్ఞానవంతులమని, విద్యను అర్జించే హక్కు మా కులానికే ఉందని, వేల సంవత్సరాలుగా కొన్ని వర్గాలను విద్యకు దూరము చేసింది ఎవరు?
వేలసంవత్సరాల నుండి కొన్ని వర్గాలను
సామాజిక న్యాయానికి, దూరం చేసింది ఎవరు?
బానిసలుగా చేసుకున్నది ఎవరు?
కాలం చెల్లి భర్త చనిపోతే, అదే శవానికి ప్రాణం ఉన్న భార్యను కూడా పాడేపై కట్టి మంటలో తగలబెట్టింది ఎవరు? అటువంటి అమానుషమైన సంప్రదాయానికి తెరలేపింది ఎవరు?
ఒకే కులానికి చెందిన బాలికలను జోగిని పేరుతో, బసివి పేరుతో "దేవుని భార్య" అనే వంకతో బడా బాబులకు వ్యభిచారిగా చేసింది ఎవరు?
భర్త చనిపోతే, భార్య చిన్నప్పటినుండి ఇష్టంగా పెట్టుకున్న పూలకు, గాజులకు, బొట్టుకు, మెరుగైన దుస్తులకు, శుభకార్యాలకు దూరం చేసింది ఎవరు?
భర్త తాగుబోతు అయినా, దుర్మార్గుడైనా, కొట్టి చంపినా, తిట్టినా, ఎన్ని బాధలు పెట్టినా భర్తే లోకమని, భర్త సేవలోనే గడపాలనీ,
అలాగైతేనే, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని,స్త్రీ జీవిత పరమార్ధం అదేనని, కల్లబొల్లి
మాటలతో మహిళను అణచివేసి, ఆంక్షలు విధించి, పనికిరాని "పతివ్రత" బిరుదు తగిలించింది ఎవరు?
ఈ దేశంలో బుద్ధుడు అనే ప్రముఖ భౌతిక వాది జన్మించి, సంఘంలోని దురాచారాలను, దుష్ట సంప్రదాయాలు, మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని వదిలించి, ప్రజలను వాస్తవాల వైపు మళ్లించడం జరిగి విశేష కృషి సల్పి నతని శిష్యులైన వేల మంది భిక్షకులను చంపించి శాస్త్రీయమైన బౌద్ధ ధర్మాన్ని కాదని, మరల తమ ఆశాస్త్రీయ మతాన్ని సమాజంలో నిలబెట్టి ప్రజలను, మూర్ఖత్వం వైపు
మళ్లించినది ఎవరు?
కల్పిత కట్టు కతలతో నిండిన మత గ్రంథాల్లోని అశాస్త్రీయ భావజాలాన్ని ప్రచారం చేస్తూ,
అందులోని పాత్రలను రాజులుగా ఉన్న వారిని, లేని మహిమలు అంటగట్టి అవతారాలు చాలిం చారని చెబుతూ వారి రూపాలను విగ్రహాలుగా చెక్కించి వారిని పూజించాలని, పూజిస్తే మనల్ని కరుణిస్తారని, వారు అవతారాలు చాలించిన తర్వాత మనలను ఎట్లా ఆదుకుంటారో????? కారణాలు చెప్పకుండా, ప్రజలను అజ్ఞానంలో ఉంచి, సోమరిపోతుల్లా బతుకుతున్నది
ఎవరు?
సైన్సును నమ్మకుండా, సైన్స్ తో తయారైన పరికరాలను వాడుతూ, మూఢత్వ ప్రచారం చేస్తున్నవారు ఎవరు?
స్వర్గ నరకాలు ఉన్నాయన్న ఒక వర్గం వారికి దానాలు చేసి, వారు చెప్పిన తీర్థయాత్రలు సందర్శించి, జాతరలు తిరగాలని, పుష్కరాలలో మునగాలని,రాతి మరియు లోహాలతో చేసిన విగ్రహాలకు పూజలు చేసిన వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని, స్వర్గంలో ఆకలి దప్పులు ఉండవని, అక్కడ దేవతలందరూ అమృతం సేవిస్తారని, వారికి చావు అనేది ఉండదని, చిరంజీవులుగా ఉంటారని, రంభ, ఊర్వశి, మేనక లతో నాట్యం చేయొచ్చని, అబద్ధాలు వల్లించే వారు ఎవరు?
పాపాలు చేస్తే నరక ప్రాప్తి సంప్రాప్తిస్తుందని,
అక్కడ శిక్షలు ఘోరంగా ఉంటాయని, నూనెలో బజ్జీలు లాగా మనల్ని వేయిస్తారని కణ కణ మండుతున్న అగ్నిస్తంభాన్ని కౌగిలించుకోమంటారని,రంపాలతో కోస్తారని ఇలాంటి ఎన్నో శిక్షలు గరుడ పురాణంలో పొందుపరిచి ప్రజలను భయభ్రాంతులను చేసేవారు ఎవరు?
ఆత్మలు ఉంటాయని మనిషి మరణించగానే ఆత్మ వేరే ప్రాణిలో దూరుతుందని, దాన్లో కొంతకాలం నుండి తర్వాతి ప్రాణంలో ధూరుతూ ఇలా 84 లక్షల జీవజాతులలో దేహాన్ని తీసుకొని మరల మనిషిగా పుడతాడని ప్రాణులకు మరుజన్మ గత జన్మ ఉంటాయని చెప్పిందెవరు?
చచ్చిన వారికి పిండాలు పెట్టాలని, మాసికాలు పెట్టాలని, పెట్టిన పిండాన్ని కాకుల రూపంలో చనిపోయిన వారు వచ్చి తింటారని కాళ్లు మొక్కించుకొని డబ్బులు అందిన కాడికి గుంజుకుంటున్నది ఎవరు?
జ్యోతిషం, వాస్తు, సంఖ్యాశాస్త్రం,సాముద్రిక శాస్త్రం పేరిట అశాస్త్రియాలను వల్లే వేస్తూ ప్రజల రక్త మాంసాలను జలగలా పీల్చే వారు ఎవరు?
ప్రభుత్వ కీలక పదవుల్లో తాము ఉంటూ, అప్రకటిత, పరోక్ష రిజర్వేషన్లు పొందుతున్న వారు ఎవరు?
ప్రజల మెదళ్లను హైజాక్ చేసి,కనపడని దేవుళ్లను, దయ్యాలను నమ్మాలని అవి ఉన్నాయని, ప్రజలకు అర్థం కాని భాషలో,పూజలు మంత్రాలు సృష్టించి ప్రజలను నిలువునా దోచుకుంటున్నది ఎవరు?
అజ్ఞానం, మూర్ఖత్వం, ప్రచారం చేస్తూ
మోసం, దగా చేసి సంపాదించేవారు ఎవరు?
పరాన్న బుక్కులుగా జీవించేది,
శ్రమ ఫలితాన్ని అనుభవించేవారు ఎవరు?
సమాజంలో అబద్దాలకు తెర లేపింది ఎవరు?
ఎవరు?... ఎవరు?.....ఎవరు?........
అడియాల శంకర్,
అధ్యక్షులు,
తెలంగాణ హేతువాద సంఘం
Comments
Post a Comment